Ghatkesar: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారపల్లి ప్రాంతంలో భారీగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్న స్మగ్లర్ను ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ (DTF) పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుడిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా బీమనపల్లి ప్రాంతానికి చెందిన ఉల్లంగి వెంకటరమణ (31)గా పోలీసులు గుర్తించారు. నిందితుడు గత కొంతకాలంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.
నారపల్లి నందనవనం సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు, డీటీఎఫ్ సీఐ భరత్ భూషణ్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో వెంకటరమణను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని వద్ద నుండి సుమారు 1.04 కిలోల హాష్ ఆయిల్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హాష్ ఆయిల్ విలువ మార్కెట్ లో సుమారు 5 లక్షలు ఉంటుందని అంచనా.
పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఒడిశాలోని పాడేరు ప్రాంతం నుండి హాష్ ఆయిల్ను తక్కువ ధరకు సేకరించి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ముఖ్యంగా ఇతను 2021 నుండి పరారీలో ఉన్నట్లు తేలింది. గతంలో పంజాగుట్ట, ఫిల్మ్నగర్, టప్పాచాబుత్ర పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు కేసుల్లో ఇతను నిందితుడిగా ఉన్నాడు.
అరెస్టయిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల కోసం, డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించడానికి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Also Read: పోలీసులకే షాక్ ఇచ్చిన గంజాయి స్మగ్లర్ల ‘లేడీ గెటప్’ స్కెచ్.. చివరికి ఏమైందంటే?