Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన కుంటుపడినప్పుడు, అవసరం అయితే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. గతంలో తనపై అనేక ఒత్తిళ్లు వచ్చాయని, కానీ ఎలాంటి ఒత్తిడికి లొంగలేదన్నారు. శ్రీకాకుళంలో ఆదివారం రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి తాను వ్యవసాయం చేసుకుంటున్నాని, తాను ఒక రైతు మాత్రమే అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు.
రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన మాత్రం లేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. వేరే ఏ పార్టీలో చేరే ఉద్దేశం తనకు ఇప్పుడు లేదని తెలిపారు. అవసరం అయితే తప్పకుండా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ జగన్ చుట్టూ ఉన్న కోటరి ఆయనను డైవర్ట్ చేస్తుందని విజయసాయి రెడ్డి అన్నారు. అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. నిబద్ధత లేని వ్యక్తుల మాటలను జగన్ నమ్మకూడదని హితవు పలికారు. అలాంటి వారి మాటలు విని జగన్ తప్పుదారి పట్టకూడదని సూచించారు. గతంలో విజయసాయి రెడ్డి ట్వీట్ ను టీడీపీ సమర్థించడంపై విలేకరులు ప్రశ్నించారు. ఇప్పటి వరకూ తనకు ఏ రాజకీయ పార్టీ నుంచి పిలుపు రాలేదన్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కూడా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు, తనకు మధ్య ఎలాంటి వైరం లేదన్నారు. 20 ఏళ్ల క్రితం నుంచే పవన్ కల్యాణ్ తో తనకు పరిచయం ఉందని, పవన్ తనకు మంచి మిత్రుడని తెలిపారు. తాను ఎప్పుడూ పవన్ కల్యాణ్ను విమర్శించలేదన్నారు. భవిష్యత్తులో కూడా పవన్ కల్యాణ్ను విమర్శించనని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
Also Read: Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ డబ్బులు పడలేదా?.. అయితే ఇలా చేయండి
రాష్ట్రంలో పొట్టిశ్రీరాములు, అన్నమయ్య, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, వైఎస్సార్ పేర్లతో జిల్లాలు ఉన్నాయని, సైరా నరసింహారెడ్డి పేరుతో జిల్లా లేదని విజయసాయి రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాకు సైరా నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అలా చేస్తే స్వాతంత్ర్య సమరయోధుడైన సైరా నరసింహారెడ్డిని గౌరవించినట్లవుతుందన్నారు. శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘ భవనాన్ని కట్టేందుకు అయ్యే ఖర్చు తాను భరిస్తానని విజయసాయి తెలిపారు. ప్రస్తుతం తాను రైతునని, దీనిపై ఎవరెన్ని సెటైర్లు వేసినా పట్టించుకోనని చెప్పారు.