Annadata Sukhibhava: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద ఖాతాల్లో రూ.7000 జమ చేసింది. ఏపీ ప్రభుత్వం రూ.5000, కేంద్ర ప్రభుత్వం రూ.2000 కలిపి మొత్తం రూ.7 వేలు నవంబర్ 19న విడుదల చేశారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. అయితే కొంత మంది రైతులకు రెండింటిలో ఒకటే పడ్డాయి. మరికొంత రైతులకు పీఎం కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవన పథకం కింద రూ.5 వేలు డబ్బులు అకౌంట్లలో పడలేదు.
కొందమంది రైతులకు పీఎం కిసాన్ ఈ-కేవైసీ పూర్తి చేయకపోవడం వల్ల డబ్బులు జమ కాలేదని తెలుస్తోంది. పీఎం కిసాన్ అర్హులైన రైతులు ఈ-కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. బయోమెట్రిక్ లేదా ఐరిష్ ద్వారా ఈ-కేవైసీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. మీసేవ కేంద్రాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్స్ లలో కేవైసీకి అవకాశం కల్పించారు. రైతులు ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత 30 నుంచి 60 రోజులలో వారి ఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఇందుకు ఆధార్-బ్యాంక్ ఎన్పీసీఐ లింక్ తప్పనిసరి. బ్యాంకుల్లో ఆధార్ ఎన్పీసీఐ లింక్ చేస్తారు.
రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకాలను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలి. ఆధార్- పాస్ బుక్ లింక్ లేకపోవడం వలన కూడా డబ్బులు పడడంలేదు. రైతులు గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ ను సంప్రదించి పట్టాదారు పాసు పుస్తకానికి ఆధార్ లింక్ చేసేందుకు ఫామ్ ఫిల్ చేసి బయోమెట్రిక్ లేదా ఓటీపీతో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు తహసీల్దార్ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ లింక్ ప్రక్రియ పూర్తి కాగానే రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదిస్తే మండల వ్యవసాయ అధికారి ద్వారా జిల్లా కార్యాలయానికి రైతుల వివరాలను పంపిస్తారు. ఆధార్-పాస్ బుక్ లింక్ పూర్తి అయితే డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయి.
రైతు బ్యాంక్ ఖాతాతో ఆధార్ ను లింక్ చేసుకోవాలి. ఎన్పీసీఐ లింక్ లేకపోవడం వలన రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదని అధికారులు చెబుతున్నారు. రైతులు తమ బ్యాంకు వెళ్లి ఎన్పీసీఐను లింక్ చేసుకోవచ్చు లేదా పోస్టాఫీసులో అకౌంట్ తీసుకుంటే ఎన్పీసీఐ లింక్ అవుతుంది. ఇలా లింక్ అయిన 30 నుంచి 90 రోజుల వ్యవధిలో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది.
2019 ఫిబ్రవరి తరువాత పొలం మ్యుటేషన్ జరిగిన వాటికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి అర్హత అవకాశం కల్పించలేదు. కేవలం వారసత్వం కింద మాత్రమే అవకాశం కల్పించారు. పీఎం కిసాన్ లబ్దిదారుల్లో భర్త లేదా భార్య.. ఇద్దరిలో ఎవరో ఒకరు మరణిస్తే వారి నామినికి పొలం మార్చుకుని అప్లై చేసుకొంటే వారిని అర్హులుగా గుర్తిస్తున్నారు.
పీఎం కిసాన్ అర్హుల జాబితాపై కేంద్రం రీవెరిఫికేషన్ చేస్తుంది. ఒకే కుటుంబంలో ఇద్దరికి డబ్బులు జమ అవుతున్న కారణంగా నగదు నిలిపివేశారు. ఫీల్డ్ వెరిఫికేషన్ అనంతరం లబ్దిదారుల్లో ఒకరికి మాత్రమే నగదు జమ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్ దారులు, ఇన్ కమ్ ట్యాక్స్ కడుతున్న వారు, రాజ్యాంగబద్ద పదవులలో ఉన్న వారు ఈ పథకానికి అనర్హులు.
అర్హులైన వారికి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ డబ్బులు పడకపోతే దగ్గరలో సచివాలయంలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే అవసరమైన డాక్యుమెంట్లు అందిస్తే తనిఖీ చేసి డబ్బులు జమ చేసే అవకాశం ఉంది.