వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. తనపై జరుగుతున్న కుట్రలు.. పార్టీలో తనను దూరం పెట్టిన వైనం.. తన భవిష్యత్తు కార్యాచరణపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న ‘కోటరీ’ వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2020 నుండే తనను పార్టీలో సైడ్ చేశారని విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను వెన్నుపోటు పొడుస్తానని జగన్ అనుమానం కలిగించి, కుట్రలు పన్ని కోటరీ మనుషులు నన్ను దూరం చేశారు. జగన్ హృదయంలో నాకు చోటు లేకపోవడంతో, ఆ వేధింపులు తట్టుకోలేక బయటకు వచ్చాను’ అని ఆయన పేర్కొన్నారు. తాను జగన్ కోసం ఒక ‘పాలేరు’లా పనిచేశానని, కష్టపడి సంపాదిస్తే కోటరీలోని పందికొక్కులు దానిని తిన్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
లిక్కర్ స్కామ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అందుకే తనను అరెస్ట్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఎంపీ మిథున్ రెడ్డికి 100 కోట్లు అరేంజ్ చేయమని రికమండ్ చేసిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, కసిరెడ్డి కంపెనీల కోసం అరబిందో నుండి ఈ ఆర్థిక సహాయం అందేలా చూశానని వెల్లడించారు. దేహంలో ప్రాణం ఉండగా అప్రూవర్గా మారనని వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశారు.
ప్రస్తుత కోటరీ తీరు మారకపోతే జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయన జోస్యం చెప్పారు. ‘కూటమిని విడగొట్టినప్పుడే జగన్కు అవకాశం ఉంటుంది.. కానీ అటువంటి వ్యూహాలు పన్నే మేధావులు ఇప్పుడు ఆయన పక్కన లేరు. అందరూ జగన్ను మిస్ గైడ్ చేస్తున్నారు’ అని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం తన ఆస్తులపై అసత్య ప్రచారం చేస్తూ వేధిస్తోందని, విశాఖలో ఉన్న ఆస్తులు తనవని నిరూపిస్తే సిట్ (SIT) సవాల్ను స్వీకరిస్తానని అన్నారు.
ఈ నెల 25 తర్వాత తన రాజకీయ పునరాగమనం ఉంటుందని విజయసాయి రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరడం లేదని, తన రాజకీయ భవిష్యత్తును తానే నిర్ణయించుకుంటానని చెప్పారు. అయితే, ‘జగన్ మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఆలోచిస్తాను’ అని ఒక చిన్న వెసులుబాటును కూడా ఆయన ఉంచడం గమనార్హం. తాను ఎన్నటికీ డబ్బుకు లొంగనని, జగన్ తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ALSO READ: Vijayasai Reddy: విజయసాయి రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం.. 7 గంటల పాటు విచారణ