ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఆయన మీద గత జగన్ సర్కారు హయాంలో నమోదు చేసిన అవినీతి అక్రమ కేసును తాజాగా విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనపై మోపిన కేసు అక్రమమని.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావాలనే ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అక్రమ కేసులు బనాయించారని తాజా కోర్టు తీర్పుతో ఇది నిరూపితమైందని తెలుగు దేశం పార్టీ శ్రేణులు చెబుతున్నారు.అన్యాయంగా చంద్రబాబు మీద కేసులు బనాయించి ఆయన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, మానసికంగా వేధించారని ఫైర్ అవుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రీవెంజ్ పాలిటిక్స్ చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించిన జగన్.. తీరా అధికారంలోకి వచ్చాక టీఫైబర్ స్కామ్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, అమరావతి ల్యాండ్ స్కామ్, కంపెనీలకు తక్కువ ధరకే భూములు కట్టబెట్టారని చంద్రబాబు, మరికొందరు నేతల మీద అక్రమంగా కేసులు బనాయించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయన్ను అరెస్టు చేయించి 53 రోజుల పాలు జైలులోనూ ఉంచారు.
వైసీపీ పవర్లోకి వచ్చాక ఫైబర్ నెట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు పెట్టించింది. 2014-19 నడుమ ఫైబర్నెట్ కార్పొరేషన్లో నిబంధనలను ఉల్లంఘించి వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారని, దానివల్ల కార్పొరేషన్కు రూ.114 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అప్పటి ఎండీ మధుసూదన్రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. నాటి ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి హరికృష్ణ, ఎండీ కె.సాంబశివరావు, టెర్రాసాఫ్ట్ డైరెక్టర్ తుమ్మల గోపాలకృష్ణ, చంద్రబాబు (ఏ-25), ముంబై, ఢిల్లీకి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటి ఉన్నతాధికారులను నిందితుల జాబితాలో చేర్చారు. మొత్తం 99 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. తాజాగా ఈ కేసులో అభియోగాలు ప్రూవ్ చేయలేదని విజయవాడ ఏసీబీ కోర్టు ఆ కేసును కొట్టివేసింది.
చంద్రబాబుతో పాటు ఈ కేసులో అభియోగం ఎదుర్కొన్న అందిరికీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ప్రస్తుత సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎటువంటి అవినీతికి పాల్పడలేదని రుజువైంది.కావాలనే జగన్ తనకు అధికారం ఉందని వ్యవస్థలను తప్పు దారి పట్టించారని, ముందస్తు ప్లాన్ ప్రకారమే అన్యాయంగా కేసుల్లో ఇరికించారని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. ఫైబర్ నెట్ కేసులో ఎటువంటి అక్రమాలు జరగలేదని కోర్టు స్పష్టం చేయడంతో జగన్ నిజస్వరూపం మరోసారి ఏపీ ప్రజలకు అర్థంఅయ్యిందని, చంద్రబాబు నిజాయితీ ఏమిటో కూడా జనాలకు అర్థం అయ్యిందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. కూటమి సర్కారు, టీడీపీపై జగన్ ఇక మీదట చేసే ఆరోపణలను ప్రజలు పట్టించుకోరని.. వారంతా అభివృద్దికి మద్దతు ఇస్తున్నారని చెబుతున్నారు. భవిష్యత్లోనూ జగన్, వైసీపీ శ్రేణులు చెప్పే అబద్దాలను, అవినీతి ఆరోపణలను ప్రజలే తిప్పికొడతారని వారు భరోసాతో ఉన్నారు.