Jogi Ramesh Bail: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాములకు బెయిల్ రావడంతో.. శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. ఉమ్మడి కడప జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టైన వీరిద్దరూ..83 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టు జోగి సోదరులకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో విజయవాడ జిల్లా జైలు నుంచి శుక్రవారం రాత్రి విడుదలయ్యారు. బెయిల్పై విడుదలైన జోగి రమేష్ సోదరులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విజయవాడకు చెందిన వైసీపీ నేతలంతా జైలు వద్దకు వెళ్లి జోగి రమేష్ను కలుసుకున్నారు.
జైలు నుంచి విడుదలయ్యాక మాజీ మంత్రి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. తనను అన్యాయంగా నకిలీ మద్యం కేసులో ఇరికించి 83 రోజులు జైల్లో పెట్టారన్నారు. సిట్ అధికారులు సీఎం చంద్రబాబు చెప్పినట్లే వింటున్నారని విమర్శించారు. తనపై కేసులు పెట్టిన అధికారులను ఆ భగవంతుడు శిక్షిస్తాడని శాపనార్థాలు పెట్టారు. అనంతరం కార్లలో ర్యాలీగా ఇంటికి బయలుదేరారు. కార్ల ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపినా.. అనుచరులు భారీగా రావడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
కార్ల ర్యాలీకి అనుమతి లేదని జోగి రమేశ్ కారును మాత్రమే అనుమతిస్తామని విజయవాడ పశ్చిమ ఏసీపీ దుర్గారావు తెలిపారు. దీంతో జోగి రమేశ్ ఏసీపీపై ఆగ్రహంతో మాట్లాడారు. కార్లన్నింటినీ అనుమతించాలని పట్టుబట్టారు. గతంలో ర్యాలీలు జరగలేదా? అంటూ ఏసీపీపై చిందులు వేశారు. జోగి అనుచరులు పోలీసులను చుట్టుముట్టడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో, తప్పని పరిస్థితుల్లో పోలీసులు జోగి, అతని అనుచరుల కార్లను అనుమతించారు. అనుమతి లేకుండా కార్ల ర్యాలీ, ఊరేగింపు చేసినందుకు జోగి రమేష్, అతని సోదరుడిపై మరో కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: మిథున్ రెడ్డి అరెస్ట్ కి ఉపోద్ఘాతం.. జోగి అరెస్ట్ పై స్పందన తూతూ మంత్రం..
ఉమ్మడి కడప జిల్లా ములకల చెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో గత ఏడాది ఏప్రిల్లో భారీగా నకిలీ మద్యం పట్టుబడింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సెట్ అధికారులు కీలక నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరైన జనార్దన్ రావు విచారణలో మాజీ మంత్రి జోగి రమేశ్ తో సంబంధాలను బయటపెట్టారు. జోగి రమేష్ సోదరులు ఇద్దరూ ఈ కేసులో భాగమై ఉన్నారని గుర్తించిన అధికాలు వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో 2025 నవంబర్లో జోగి బ్రదర్స్ ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి 83 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఒక కేసులో బెయిల్ రాగా, తాజాగా లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో జోగి రమేశ్ సోదరులు బెయిల్పై విడుదలయ్యారు.