Visakhapatnam Future City: విశాఖపట్నం- తూర్పు తీరంలోని ఆర్థిక, పారిశ్రామిక, టూరిజం రంగాల పటిష్ఠ కేంద్రంగా.. విశాఖను తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాతో సమావేశమై ఈ సందర్బంగా కీలక చర్చలు జరిపారు.
విశాఖలో జరుగుతున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సందర్భంగా.. వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నావికాదళం నిర్వహిస్తున్న కీలక కార్యకలాపాలు, రక్షణ సదుపాయాల విస్తరణపై ఆయన సీఎంకి వివరాలు అందించారు. భారత నావికాదళానికి సాంకేతిక సహాయం అందించే కంపెనీలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్లను ఏపీకి ఆహ్వానించాలన్న అంశంపై ఇరువురి మధ్య విస్తృత చర్చ జరిగింది.
సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యాలకు అనుగుణంగా.. రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నౌకా నిర్మాణం, రక్షణ సామాగ్రి తయారీ వంటి రంగాల్లో రాష్ట్రానికి మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. విశాఖలో ఇప్పటికే అనేక రక్షణ సంబంధిత సంస్థలు ఉన్నప్పటికీ, వాటిని మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.
విశాఖను బెస్ట్ టూరిజం డెస్టినేషన్ గా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరించారు. సముద్రతీర అందాలు, సాంస్కృతిక వారసత్వం, రక్షణ రంగ ప్రదర్శన కేంద్రాలు కలిపి విశాఖను ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. విశాఖను నేవల్ హిస్టరీ, మెరైన్ టెక్నాలజీ, టూరిజం సమ్మేళనంగా తీర్చిదిద్దాలని మేము భావిస్తున్నాము అని తెలిపారు.
అలాగే ప్రజల్లో రక్షణ రంగంపై అవగాహన పెంచేందుకు నావీ మ్యూజియంలు, సైనిక శిక్షణ సెంటర్లు, టెక్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం అవసరమని సీఎం అన్నారు. యువతలో రక్షణ రంగంపై ఉత్సాహం పెరుగుతుండటం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. నావీ చేపట్టే వివిధ ప్రాజెక్టులకు, కార్యకలాపాలకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని సిఎం చంద్రబాబు వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాకు తెలిపారు.
Also Read: సీఎం చంద్రబాబుపై జగన్ సెటైర్లు.. క్రెడిట్ చోరీ స్కీం అదిరిందయ్యా చంద్రం!
రాష్ట్రంలో రక్షణ రంగానికి మద్దతుగా అవసరమైన భూమి, సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. నావికాదళం చేపట్టే ఫ్లీట్ రివ్యూలు, మెరైన్ ఈవెంట్లు విశాఖ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచుతున్నాయని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం ఫ్లీట్ రివ్యూ సమయంలో విశాఖ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఇది నగరానికి గర్వకారణం అని సీఎం పేర్కొన్నారు.