Nara Lokesh: ఏపీని డిజిటల్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ గురువారం విశాఖలోని నాలుగు ఐటీ కంపెనీలకు, రహేజా పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
నారా లోకేష్ ప్రవేశపెట్టిన డిజిటల్ ఏపీ ఇండియా ఏఐ మిషన్ దిశగా ఈ ప్రాజెక్టులు.. ఒక కీలకమైన అడుగుగా భావించబడుతున్నాయి. రాష్ట్రాన్ని టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI), ఆటోమేషన్ రంగాల్లో దేశంలో అగ్రస్థానానికి తీసుకెళ్లడమే ఈ మిషన్ లక్ష్యం.
విశాఖలోని హిల్ నంబర్ 3 వద్ద సెయిల్స్ సాఫ్ట్వేర్ సంస్థ ఆధునిక “అడ్వాన్స్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ అండ్ ఏఐ ఎక్సలెన్స్ సెంటర్”ను స్థాపిస్తోంది. ఈ సెంటర్లో కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఆటోమేషన్ రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రారంభ దశలోనే 300 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ పెట్టుబడులు “డిజిటల్ ఏపీ” లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయని నారా లోకేష్ పేర్కొన్నారు.
హిల్ నంబర్ 2లో ఐ స్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ తమ ఆర్అండ్డీ సెంటర్ను నెలకొల్పనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రోడక్ట్ డెవలప్మెంట్, మెయింటినెన్స్ సర్వీసులు, ఐటి సొల్యూషన్స్, ఆటోమేషన్ ఎనేబుల్డ్ బీపీవో/కేపీవో సేవలు అందించనున్నాయి.
ప్రత్యేకంగా హెల్త్కేర్ రంగానికి సంబంధించి ఏఐ ఆధారిత సొల్యూషన్స్ , ఏజెంట్ ఏఐ సిస్టమ్స్ అభివృద్ధిపై ఈ సంస్థ దృష్టి పెట్టింది. ఈ యూనిట్ ద్వారా లో-కోడ్ టెక్నాలజీ, ఏఐ డెవలప్మెంట్, హెల్త్కేర్ డేటా సెక్యూరిటీ రంగాల్లో విశాఖలోనే గ్లోబల్ స్థాయి నిపుణుల బృందం ఏర్పడనుంది.
తమ్మిన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ ఐటీ రంగంలో పెద్ద స్థాయి పెట్టుబడులకు సిద్ధమైంది. రాబోయే ఐదు సంవత్సరాలలో సుమారు 2000 మందికి పైగా ఐటీ ఉద్యోగాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ టెక్నాలజీ, ఆటోమేషన్, ఏఐ ఆధారిత బిజినెస్ సొల్యూషన్స్ రంగాల్లో ఈ సంస్థ విశాఖలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందనుంది.
ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖలో రెండు విడతల్లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. మొదటి విడతలో రూ.20 కోట్లు, రెండవ విడతలో రూ.185 కోట్లు పెట్టుబడులు పెట్టి, మొత్తం రూ.205 కోట్ల ప్రాజెక్టుగా రూపొందిస్తోంది. ఈ సంస్థ ద్వారా సుమారు 2500 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రత్యేకంగా ఏఐ టూల్స్, క్లౌడ్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్స్ టెక్నాలజీ, బిజినెస్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ రంగాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగించనుంది.
విశాఖలోని రహేజా ఐటీ స్పేస్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ను కూడా ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్ట్ కింద కమర్షియల్ ఆఫీస్ స్పేస్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్సులు, హోటల్స్, మాల్స్ వంటి మల్టీ సెక్టార్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం రూ.172 కోట్ల భారీ పెట్టుబడితో, ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 8000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి.
Also Read: ఏపీ వైపు భారత్ ఫోర్జ్.. వాటిలో పెట్టుబడులు, సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ వైస్ ఛైర్మన్ భేటీ
ఇక విశాఖ ఎండాడ ప్రాంతంలో కపిల్ గ్రూప్ ఆధ్వర్యంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా రూపుదిద్దుకోబోతోంది. ఇది విశాఖను అంతర్జాతీయ వాణిజ్య, ఐటి, వ్యాపార సహకారాల ప్రధాన కేంద్రంగా మార్చనుంది.