Vivekananda Murder Case: వివేకానంద హత్య కేసు సీరియస్ మాదిరిగా సాగుతోంది.ఈ కేసులో అసలు నిందితుల కోసం ఎడతెగని పోరాటం చేస్తోంది వివేకా కూతురు సునీత. తాజాగా సునీత పిటిషన్పై కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. ఈ కేసు దర్యాప్తుకు ఏయే అంశాలు అవసరమో స్పష్టంగా చెప్పాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి ఐదుకి వాయిదా వేసింది.
వివేకానంద కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
వివేకానంద హత్య కేసు విచారణకు ముగింపు ఎప్పుడు? సీరియల్ మాదిరిగా ఇంకా సాగుతోందా? అయితే కింది కోర్టు.. లేకుంటే పైకోర్టు తలుపు తడుతూనే ఉంది బాధిత కుటుంబం. తాజాగా ఈ కేసు విచారణ దర్యాప్తు సంస్థ సీబీఐ వద్దకు చేరింది. ఈసారైనా సునీత ఫ్యామిలీకి న్యాయం జరుగుతుందా? కింది కోర్టు మాదిరిగా సీబీఐ.. విచారణ నుంచి తప్పించుకుంటుందా? ఇలా రకరకాల ప్రశ్నలు మొదలయ్యాయి.
వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు పై ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సునీత రెడ్డి. ఈ పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం జస్టిస్ సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ విచారణ చేపట్టింది. సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుథ్రా న్యాయస్థానం ముందు తమ వాదనలు వినిపించారు.
బంతి సీబీఐ చేతిలో.. ఫిబ్రవరి ఐదున తాడోపేడో
ధర్మాసనం ఆదేశాల మేరకు తాము ట్రయల్ కోర్టుకి వెళ్లామని, పిటిషన్లో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. పిటిషన్లో లేని అంశాలపై పాక్షిక దర్యాప్తుకు అనుమతించిన విషయాన్ని గుర్తు చేశారు. తాము అడగని విషయాలపై పాక్షిక దర్యాప్తు ఏంటని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. సునీత పిటిషన్పై సీబీఐ తన వైఖరి స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది.
ఈ సందర్బంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకెంత కాలం ఈ కేసు దర్యాప్తు కొనసాగించాలనుకుంటున్నారు? మళ్ళీ మినీ ట్రయల్ కొనసాగించాలనుకుంటున్నారా? ఇలాగైతే దర్యాప్తు పూర్తి కావడానికి మరో పదేళ్లు పడుతుందని వెల్లడించింది. దీనిపై సీబీఐ తన వైఖరి తెలియజేయాలని, తదుపరి దర్యాప్తు అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేయాలని తెలిపింది.
ALSO READ: కన్నబిడ్డ కోసం దివ్యాంగుడి పోరాటం.. ఏడాది దాటినా దొరకని ఆచూకీ
సీబీఐ నిర్ణయం ఆధారంగా తాము నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఒకవేళ తదుపరి దర్యాప్తు కావాలనుకుంటే ఎంత మేరా కావాలి? దర్యాప్తుకు అనుమతిస్తే బెయిల్ పై దాని ప్రభావం ఎలా ఉంటుంది? అన్ని అంశాలను తాము బ్యాలెన్స్ చేయాల్సి ఉందని పేర్కొంది. తమ వైఖరి తెలియజేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరపున న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి ఐదుకి వాయిదా వేసింది న్యాయస్థానం.