Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంటోంది. ఇప్పటికే అనేక విభాగాలను ప్రైవేటీకరణ చేసిన యాజమాన్యం, తాజాగా కాస్టింగ్ మిషన్ విభాగాన్ని కూడా ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లడం కార్మిక వర్గాల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ నిర్ణయం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కంటిన్యూ వన్ కాస్టింగ్ మిషన్ (CCM) విభాగాన్ని రూ.133 కోట్ల విలువతో, రెండేళ్ల కాల పరిమితికి ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విభాగం స్టీల్ ఉత్పత్తి ప్రక్రియలో అత్యంత కీలకమైనదిగా కార్మికులు చెబుతున్నారు. స్టీల్ మెల్టింగ్ షాపు నుంచి వచ్చే లిక్విడ్ స్టీల్ను దిమ్మలుగా తయారు చేసే ముఖ్యమైన పని ఈ విభాగంలోనే జరుగుతుంది.
కాస్టింగ్ మిషన్ విభాగం 24 గంటలు నిరంతరాయంగా పనిచేసే విభాగం కావడం విశేషం. ప్లాంట్ ఉత్పత్తి వ్యవస్థలో ఇది కీలక లింక్గా వ్యవహరిస్తుంది.
ప్రస్తుతం ఈ కాస్టింగ్ మిషన్ విభాగంలో సుమారు 250 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కో షిఫ్ట్కు 60 నుంచి 70 మంది వరకు ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటారు. ఈ విభాగం ప్రైవేటీకరణ జరిగితే, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు ఏమవుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
కాస్టింగ్ మిషన్ విభాగాన్ని ప్రైవేటీకరణ చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం.. ఉద్యోగులను విఆర్ఎస్కు పంపడమేనని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఉద్యోగులను అవసరం లేదని చెప్పి బలవంతంగా విఆర్ఎస్కు ఒప్పించే పరిస్థితులు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని విభాగాల్లో ఇదే తరహా పరిస్థితులు ఎదురయ్యాయని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.
Also Read: నగరిలో వేడెక్కుతున్న రాజకీయం.. రోజా వర్సెస్ వైసీపీ సీనియర్ లీడర్ల మధ్య పోరు
ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్లో 32 విభాగాలను ప్రైవేటీకరణ చేసినట్లు కార్మిక సంఘాలు వెల్లడిస్తున్నాయి. ఒక్కో విభాగాన్ని విడతల వారీగా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ, చివరికి మొత్తం ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే వ్యూహమే యాజమాన్యం అనుసరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. మిగిలిన విభాగాలను కూడా ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.