Vizag steel plant accident: ఏపీలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ప్లాంట్లోని ఎస్ఎంఎస్-2 (SMS-2) విభాగంలో ఉన్న సీసీడీ డిపార్ట్మెంట్లో భారీ పేలుడు చోటుచేసుకుంది. అక్కడ ఉన్న స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఫ్యాక్టరీ అంతా అల్లకల్లోలంగా మారింది. ఈ సడన్ బ్లాస్ట్తో ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కాపాడుకోవడానికి భయంతో పరుగులు తీశారు.
సుమారు 1500 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతతో వెళ్తున్న స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ ఒక్కసారిగా పేలిపోవడమే ప్రమాదానికి కారణమని సమాచారం. పేలుడు ధాటికి 8 మంది మరణించగా. .మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సీఎం దిగ్బ్రాంతి:
స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలపై అధికారులతో మాట్లాడారు. అంతే కాకుండా పలువురు కార్మికులు చనిపోవడం గురించి ఆయన విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
మంత్రి అత్యవసర సమీక్ష:
వైజాగ్ అగ్నిప్రమాదంపై హోం మంత్రి అనిత స్పందించారు. విజయనగరం పర్యటనలో ఉన్న ఆమె విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు. ప్రయాణంలోనే వైజాగ్ కలెక్టర్, సీపీలతో ఫోన్లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు అత్యంత మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశిస్తూ.. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.