WAPCON 2026: విశాఖపట్నం వేదికగా నిర్వహించిన WAPCON–2026 (Women Ayurveda Parishad Conference) భారతదేశ ఆయుర్వేద రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది. దేశంలోనే మొట్టమొదటి జాతీయ మహిళా ఆయుర్వేద పరిషత్ సదస్సుగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. కేంద్ర ఆయుష్ శాఖ ప్రత్యక్ష మద్దతుతో, “స్వస్థ నారి – శశక్త భారత్” అనే విశిష్ట నినాదంతో జరిగిన ఈ సదస్సు, మహిళా ఆరోగ్యమే దేశాభివృద్ధికి మూలాధారమనే బలమైన సందేశాన్ని సమాజానికి అందించింది. ఆరోగ్యవంతురాలైన మహిళ ఒక బలమైన కుటుంబానికి, సుస్థిరమైన సమాజానికి, శక్తివంతమైన దేశానికి పునాది అని ఈ సమావేశం పునరుద్ఘాటించింది.
ఈ సదస్సులో మహిళల బహుముఖ పాత్ర, నాయకత్వ పటిమతో పాటు వారు నిత్యం ఎదుర్కొనే హార్మోనల్ సమస్యలు, మానసిక ఆరోగ్య సవాళ్లపై వైద్య నిపుణులు సుదీర్ఘంగా చర్చించారు. మహిళా ఆరోగ్యం మెరుగుపడితే అది కేవలం ఆ వ్యక్తికే పరిమితం కాకుండా, భవిష్యత్తు తరాల సంక్షేమం, పిల్లల విద్యా పురోగతి, కుటుంబాల ఆర్థిక స్థిరత్వం మరియు సామాజిక భద్రత వంటి అంశాలపై సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. సమాజంలో సమానత్వం, న్యాయం మరియు అభివృద్ధి సుస్థిరంగా ఉండాలంటే మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే విధానాలను ప్రభుత్వాలు మరియు సంస్థలు తప్పనిసరిగా అవలంబించాలని ఈ వేదిక స్పష్టం చేసింది.
WAPCON–2026లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు వందలాది మంది ఆయుర్వేద వైద్య నిపుణులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు పాలసీ నిర్ణేతలు పాలుపంచుకున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన అవరోధాలను అధిగమించడానికి అవసరమైన వ్యూహాలు, వ్యాధి నిరోధక సంరక్షణ (Preventive Care), మరియు సంప్రదాయ ఆయుర్వేద విజ్ఞానాన్ని అత్యాధునిక వైద్య పద్ధతులతో సమన్వయం చేసే మార్గాలపై లోతైన మథనం జరిగింది. ఈ చర్చల ద్వారా ఆరోగ్యవంతమైన, సాధికారత కలిగిన భారతదేశ నిర్మాణంలో ఆయుర్వేద పాత్రను మరింత క్రియాశీలం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఈ సదస్సులో గౌరవ అతిథిగా పాల్గొన్న ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రా ఛైర్మన్ డాక్టర్ రామకృష్ణ గ్లోబల్ ఆయుర్వేద మరియు బ్యూటీ ఇండస్ట్రీపై కీలక విశ్లేషణ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే హెర్బల్ రా మెటీరియల్లో 60 శాతానికి పైగా భారతదేశం నుంచే ఎగుమతి అవుతుండటం మన దేశానికున్న గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు. భారతీయ ఆయుర్వేద విజ్ఞానం, దక్షిణ కొరియా ఇన్నోవేషన్, థాయ్లాండ్ సస్టైనబుల్ మాన్యుఫ్యాక్చరింగ్ పద్ధతులు మరియు ఆసియాలోని అపారమైన ఔషధ మొక్కల సంపదను సమన్వయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటికి ఆధునిక విజ్ఞానం, కృత్రిమ మేధస్సు (AI), మరియు క్వాంటం టెక్నాలజీలను జోడించడం ద్వారా గ్లోబల్ బ్యూటీ ఇండస్ట్రీని రాబోయే దశాబ్దాల్లో భారతదేశం శాసిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రకృతి సిద్ధమైన మరియు ఆయుర్వేద ఆధారిత బ్యూటీ ఉత్పత్తుల రంగంలో పెట్టుబడులు పెడుతున్న వ్యాపారవేత్తలు కేవలం లాభాలకే పరిమితం కాకుండా, సుస్థిర సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని డాక్టర్ రామకృష్ణ పిలుపునిచ్చారు. WAPCON–2026 వంటి సదస్సులు మహిళా ఆరోగ్యం, సస్టైనబుల్ బ్యూటీ మరియు ఆయుర్వేద రంగాలపై ప్రజల్లో చైతన్యాన్ని నింపుతాయని, తద్వారా “స్వస్థ నారి – శశక్త భారత్” కల సాకారమవుతుందని సమావేశం ముగింపులో వక్తలు అభిప్రాయపడ్డారు.