Tiger Attack: తెలంగాణలో పులి దాడి చేసిన ఎనిమిది పశువులకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని అటవీశాఖ అధికారులు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సంచరిస్తున్న పులి విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అటవీ శాఖ నిరంతర పర్యవేక్షణ చేస్తుందన్నారు. హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సోమవారం పీసీసీఎఫ్ డా.సువర్ణ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పులిఎక్కడ తిరుగుతోంది, ప్రజలు ఎలా జాగ్రత్తగా ఉండాలి, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ నెల 8న పులి సిద్ధిపేట జిల్లా ఆరేపల్లి గ్రామం పరిసరాల్లో ఉన్నట్లు అటవీ శాఖ బృందాలు నిర్ధారించాయని, పులి ఉత్తర దిశగా కదులుతున్నట్లు ట్రాకింగ్ ద్వారా తెలిసిందన్నారు. ప్రజలకు, పులికి ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు సిద్ధిపేట, జనగాం, కరీంనగర్, యాదాద్రి జిల్లాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశారన్నారు. ఈ బృందాలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ, పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయన్నారు. పుణె నుంచి వచ్చిన టైగర్ రెస్క్యూ నిపుణులు పరిస్థితిని పర్యవేక్షిస్తుండగా, స్థానిక వెటర్నరీ డాక్టర్లు సహకారం అందిస్తున్నారు.
అవసరమైతే ఎన్టీసీఏ నిబంధనల ప్రకారం పులిని పట్టుకునే చర్యలు తీసుకుంటామని అటవిశాఖ అధికారులు తెలిపారు. రైతులు విద్యుత్ వైర్లు పెట్టడం, ఉచ్చులు వేయడం చేయరాదని హెచ్చరించా. పశువులను రాత్రివేళ తప్పనిసరిగా సురక్షిత షెడ్లలో ఉంచాలని సూచించారు. ప్రజల భద్రతే ప్రధానంగా పులి సంరక్షణకు భంగం కలగకుండా శాస్త్రీయ పద్ధతిలో చర్యలు కొనసాగిస్తామన్నారు. పులి కదలికలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.