Congress Complaint: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకులు తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, యూత్ కమిటీల ఆధ్వర్యంలో ఎస్సై ఉపేందర్కు పిటిషన్ అందజేశారు.
ఫిర్యాదు అనంతరం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్లు మాట్లాడారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై ఈ స్థాయి మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
సీఎం పరువును దిగజార్చేలా మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదని తొర్రూరు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణల స్థాయికి వెళ్లడం ప్రజలు సహించరని హెచ్చరించారు. సంస్కారహీనంగా మాట్లాడిన కేటీఆర్ పై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఆదివారం తొర్రూరులో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు పాలిచ్చే బర్రెను విడిచి.. తన్నె బర్రెను తెచ్చుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు స్టువర్టుపురం దొంగలని.. మరోమారు వాళ్లను నమ్మి మోసపోవద్దని చెప్పారు. గతంలో చాలా మంది సీఎంలను చూశామని.. బూతులు మాట్లాడే సీఎం ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో రేవంత్ రెడ్డి ఒక్కరేనని విమర్శించారు. ఆయన అనముల రేవంత్ రెడ్డి కాదని.. లాగుల తొండల్ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు.