తెలంగాణ ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితిపై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీకి సంబంధంలేని పార్టీని ఆయన ఎందుకు టార్గెట్ చేసుకున్నారు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ వైసీపీని వదిలేసి గులాబీ పార్టీపై ఎందుకంత ఘాటు విమర్శలు చేశారని జోరుగా చర్చ జరుగుతున్నది. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం వలన ఏపీ నుంచి వెళ్లి తెలంగాణలో చదువుకుంటున్న ఓ కులానికి చెందిన వారంతా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఫలితంగా వారంతా రిజర్వేషన్లకు దూరంగా ఉండాల్సి వస్తుందని ఆరోపించారు.
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన కారు పార్టీ.. 2023 సార్వత్రిక ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసింది. తాను దేశ్ కీ నేత అవుతానని మాజీ సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ను ప్రకటించారు. బిహార్,మహారాష్ట్ర,ఏపీలో పర్యటనలు చేశారు. అక్కడ రిక్రూట్ మెంట్స్ చేశారు. పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఏపీలోని గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని స్థాపించి అక్కడ ఇన్ చార్జులను సైతం నియమించారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది. దీంతో ఏపీతో పాటే మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా పోయాయి. అందులో చేరిన నాయకులు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు.
ఈ క్రమంలోనే మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఏపీలో రాజకీయాలు చేద్దామని వస్తే తన్నితరిమేస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం గోదావరి జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పై వ్యాఖ్యలు చేశారు. అసలు మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పేమిటి? ఏపీ మంత్రికి ఎందుకంత కోపం వచ్చింది? ఆ పార్టీని ఏపీలో అడుగుపెట్టనివ్వబోమని ఎందుకు అలా హెచ్చరకలు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. వాస్తవానికి ఏపీ నుంచి వలస వచ్చి తెలంగాణలో జీవనం సాగిస్తున్న కొందరు శెట్టి బలిజలకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని బీసీ జాబితానుంచి తొలగించి ఓసీ జాబితాలో కలిపింది.దీంతో వారికి రిజర్వేషన్ సౌకర్యం లేకుండా పోయింది. ఓసీ కార్డును అడ్డం పెట్టి శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్ షిప్, రీయింబర్స్ మెంట్ ఏది అందదు. దీనికి తోడు ఆ కుటుంబాలు సంక్షేమపథకాలకు సైతం నోచుకోకుండా అయ్యాయి.
Jamili : తెలంగాణలో జమిలి.. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్?
కేసీఆర్ నిజంగానే శెట్టి బలిజలకు అన్యాయం చేశారన్న ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్.. అంతటితో ఆగకుండా సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు దాటి వస్తానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణకే పరిమితమైన గులాబీ పార్టీ, ఆంధ్రా గడ్డపై కాలు మోపాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన ధ్వజమెత్తారు.ముఖ్యంగా శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నాయి. తెలంగాణలో శెట్టిబలిజలను ఓసీల్లో చేర్చి అన్యాయం చేసిన చరిత్ర కేసీఆర్దే అని మండిపడ్డారు. అలాంటి పార్టీ ఇక్కడ అడుగుపెడితే, శెట్టిబలిజలంతా ఏకమై తొక్కి పడేస్తారంటూ మంత్రి మండిపడ్డారు. కాగా, ఏపీ మంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు సైతం గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. కేసీఆర్ ఏపీలో ఉన్న వారికి తొలగించలేదు కదా? అంటూ మండిపడుతున్నారు.