తెలంగాణలో జమిలి ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న తరుణంలో ఆ ఎన్నికలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నది. కానీ, దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహణ అనేది సాధ్యం అవుతుందా? అనే చర్చ సైతం తెరమీదకు వస్తున్నది. ఎందుకంటే జమిలి నిర్వహణతో ఎన్నికల ఖర్చు కలిసి వస్తుందని, అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి, దీర్ఘకాలిక లక్ష్యాల నిర్ణయంలోనూ సరైన విధానం అమలవుతుందని కేంద్రం భావిస్తున్నది. ఎందుకంటే కేంద్రంలో ఓ పార్టీ కొలువుదీరిన ఏడాది, రెండేళ్లలో రాష్ట్రాల ఎన్నికలు రావడంతో పదే పదే కోడ్ అమలులోకి రావడంతో సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ నిర్ణయాల్లోనూ జాప్యం జరుగుతోందని.. బలగాల తరలింపు,రవాణా వంటి ద్వారా ఖర్చు పెరుగుతోందని చెబుతోంది.
జమిలి ఎన్నికల నిర్వహణ దేశంలో ఇదే మొదటి సారి అనుకుంటే పొరపాటే.. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు దేశజనాభా, ఆర్థిక వనరులు కూడా తక్కువే. అప్పుడు బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియ జరిగేది.కానీ, ఇప్పుడు వ్యవస్థ అంతా మారిపోయింది. జమిలి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఖర్చు తగ్గించాలని గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (యూపీఏ) టైంలోనూ ప్రయత్నించగా అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం కేంద్రంలోని మోడీ సర్కారు జమిలి ఎన్నికల నిర్వహణపై పట్టుదలతో ఉన్నది. అయితే, జమిలి ఎన్నికల నిర్వహణతో రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లుతుందని, ప్రభుత్వం గడువు ముగియకముందే మరల ఎన్నికలకు వెళ్లడం సరికాదని.. ఇది ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.మరికొందరేమో జమిలి నిర్వహణ వలన దేశానికి ఖర్చు కలిసివస్తుందని మద్దతుగా నిలుస్తున్నారు.
జమిలి ఎన్నికలు అనగా.. పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ దాదాపు ఆ పార్టీలకే ప్లస్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయి నాయకులు అంతా ఇక్కడ లోక్సభ నియోజకవర్గం కిందకు వచ్చే అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ వారుప్రచారం చేస్తారు. అప్పుడు జాతీయ పార్టీలకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గత రెండు టర్ములుగా పార్లమెంట్ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగుతున్నాయి. ఎంపీ ఎన్నికల్లో జాతీయ పార్టీకి ఓటు వేస్తున్న ప్రజలు.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తమకు నచ్చిన పార్టీకి, అభ్యర్థులను ఎంచుకుంటున్నారు. గత ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 ఎంపీ స్థానాలు రాగా.. ప్రాంతీయ పార్టీకి సున్నా వచ్చాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఎక్కువ స్థానాలు వచ్చాయి..
Tirumala Ghee Case: తిరుమల లడ్డూ ఇష్యూ.. సుప్రీంకోర్టులో దక్కని రిలీఫ్.. స్వామి పిటిషన్ కొట్టివేత
ఇప్పుడు కూడా జమిలి ఎన్నికలు జరిగితే బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ముద్ర పడి ఉన్నందున ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లోనూ దెబ్బపడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం జమిలి ఎన్నికలకు జై కొట్టినట్టు సమాచారం.జమిలితో ప్రస్తుత ప్రభుత్వానికి మరో ఆరు నెలలు అధికంగా పాలన సాగించడానికి సమయం దొరికే చాన్స్ ఉన్నట్టు సమాచారం. ఇక జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలు తొక్కేయడం కామన్ అని పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అదే జరిగితే బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం పక్కాగా తెలుస్తున్నది.