YCP Leaders: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ రాజకీయం విచిత్రంగా తయారైంది. ఓ వైపు అక్రమ అరెస్టులు, మరో వైపు ప్రభుత్వ వైఫల్యాలు అంటూ.. వైసీపీ వెన్ను పోటు పుస్తకాల అవిష్కరణ కార్యక్రమాలు చేపడుతోంది. జిల్లా మామిడి రైతుల అందోళనల్ని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్న వారికి సొంత తప్పిదాలు నెగిటివ్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థుతుల్లో ఐక్యతా రాగం వినిపించాల్సిన ప్రతిపక్ష నేతలు .. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తూ.. క్యాడర్ను నిర్లక్ష్యం చేస్తుండటం.. పార్టీ శ్రేణులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంట.
తల్లికి వందనం నిధుల విడుదలతో సర్వత్రా హర్షం
ఏడాది పాలన ముగిసిన సందర్భంగా కూటమి ప్రభుత్వం.. తల్లికి వందనం నిధులు విడుదల చేయడంతో.. సర్వత్రా హార్షం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం ఇంటికొకరికి మాత్రమే అమ్మఒడి ద్వారా రూ.13వేలు ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం 13వేలు చొప్పున ఇంటిలో ఎంతమంది బడికి వెళ్ళే పిల్లలు ఉంటే అంతమందికి అందజేయడం, అది కూడా ఓకే రోజు బ్యాంకు అకౌంట్స్లో పడటంతో పాజిటివ్ గా మారిందని అంటున్నారు. ముఖ్యంగా జిల్లాలో మైనార్టీ కుటుంబాలకు అతి ఎక్కువ మొత్తం పడటంపై.. హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పీలేరు నియోజకవర్గం కలికిరిలో అయితే ఏకంగా ఓ మైనార్టీ కుటుంబంలో 12 మందికి అమ్మకు వందనం కింద సాయం అదింది.
కిలో మామిడికి రూ.4 సబ్సిడీ ప్రకటించిన ప్రభుత్వం
గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో మామిడి పంట ఈసారి పండింది. ఏకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో.. ఐదులక్షల టన్నుల మామిడి ఉత్పత్తి అయింది. దానికితోడు గత రెండు సంవత్సరాలుగా పల్ప్ యూనిట్లలో మామిడి గుజ్జు నిల్వ ఉంది. మామిడి అమ్మకాలకు అంతర్జాతీయంగా సమస్యలు ఉన్నాయని అంటున్నారు. గుజ్జు ఎక్కువుగా ఎగుమతి అయ్యే యూరప్ దేశాలలో యుద్దవాతావరణం వల్ల అమ్మకాలు సాగించలేక పోతున్నట్లు అధికార యంత్రాంగం చెపుతోంది. ఈ స్థితిలో మామిడికి కిలో నాలుగు రూపాయలు చొప్పున ప్రభుత్వం సబ్సీడి ప్రకటించింది.
పల్ప్ యూనిట్లు కిలో రూ.8కి కొనాలని ఆదేశం
పల్ప్ యూనిట్లు కిలో 8 రూపాయలకు కొనాలని ప్రభుత్వం అదేశించింది. అయితే పల్ప్ యూనిట్లు ఈ విషయంలో తమకు బ్యాంకు నుంచి నిధులు ఇప్పించాలని మెలిక పెట్టాయి. చివరకు అధికారులు బ్యాంకర్లతో మాట్లాడి జిల్లాలో ఉన్న మెజార్టీ పల్ప్ యూనిట్లను తిరిగి తెరిపించే లోగా రైతులు రోడ్డెక్కారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే వారికి మద్దతుగా ప్రెస్ నోట్ రీలీజ్ చేసారు. అయితే పెద్దిరెడ్డికి చెందిన పల్ప్ యూనిట్లలో.. ఎంతకు కొనుగోలు చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయన యూనిట్లలో సైతం కేవలం 5-6 రూపాయలు ఇస్తున్నారని, అయన 8 రూపాయలు ఇచ్చి మాట్లాడాలని కౌంటర్ ఇస్తున్నారు.
పాత పద్దతిలో కూటమి పెద్దలపై రోజా విమర్శలు
మరో వైపు మాజీ మంత్రి రోజా పదేపదే సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్య వరుసగా లోకేష్ , చంద్రబాబులపై రోజా పాత పద్దతిలో విమర్శలు చేస్తున్నారు. లోకేష్ను మళ్లీ పప్పు అని సైతం విమర్శించారు. దాంతో పాటు తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై దిగజారుడు విమర్శలు గుప్పించారని క్యాడర్ ఫైర్ అవుతోంది. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో సైతం ఇదే విదంగా మాట్లాడిన రోజాపై.. తెలుగు తమ్ముళ్లు నిప్పులు చెరుగుతూ కేసులు పెట్టడానికి సిద్దమవుతున్నారు. రోజా రైతుల సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వ్యక్తిగతంగా విమర్శలు గుప్పిస్తుండటంపై ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది.
విజిలెన్స్ నోటీసులు పట్టించుకోని చెవిరెడ్డి
మరో వైపు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యవహారం మరింత హీటెక్కింది. మద్యం స్కామ్తో పాటు తుడా విజిలెన్స్ విచారణ ఇప్పుడు తెరమీదకు వచ్చింది. తుడాపై జరుగుతున్న విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంటు విచారణకు సంబంధించి తుడా మాజీ చైర్మన్లు అయిన చెవిరెడ్డి, అయన కూమారుడు మోహిత్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోక పోవడంతో , విజిలెన్స్ రెండో దఫా నోటీసులు జారీ చేసింది.
వ్యక్తిగత సిబ్బందిని సిట్ వేధిస్తోందని చెవిరెడ్డి విమర్శలు
మరో వైపు మద్యం కేసులో తన వ్యక్తిగత సిబ్బందిని సిట్ వేధిస్తోందని చెవిరెడ్డి విమర్శిస్తున్నారు. తాజాగా చెవిరెడ్డికి గత పది సంవత్సరాలు.. గన్ మ్యాన్ గా పనిచేసిన మదన్రెడ్డి డీజీపీకి రాసినట్లు చెబుతున్న లేఖ బయటకు రావడంతో.. వ్యవహారం మరింత హీట్ ఎక్కింది. తనను టార్గెట్ చేసి కావాలని కేసులో ఇరికించడానికి.. జరుగుతున్న ప్రయత్నమే ఇదని చెవిరెడ్డి చెప్పుకుంటున్నారు. దానికి విదేశాలకు వెళ్లాలనుకున్న చెవిరెడ్డిని లుక్ అవుట్ నోటీసులు ఉండటంతో.. బెంగుళూరు విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం బయటకు పొక్కడంతో త్వరలో చెవిరెడ్డి అరెస్ట్ ఖాయమని వైసీపీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారాలన్నీ చూస్తూ జిల్లాకు చెందిన పలువురు వైసీపీ సీనియర్లు బయటకు వచ్చి మాట్లాడటానికే భయపడుతుండటంతో వైసీపీ క్యాడర్ దిక్కులేకుండా తయారైందంటున్నారు.