జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని డబ్బులు పంపిణీ చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అలాగే ఓటర్లకు చీరలు, రైస్ కుక్కర్లు, గ్రైండర్లు పంచుతున్నారు. ఇంత చేస్తుంటే స్థానిక అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఎన్నికల ప్రధాన అధికారికి ఫోటోలు, వీడియోలతో సహా ఆధారాలు అందించినట్లు హరీష్ రావు చెప్పారు.
మహబూబాబాద్ జిల్లాలో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులు కలెక్టర్ను ఆశ్రయించారు. పిల్లలతో పాటు కుటుంబ సమేతంగా వారికి విద్య, ఉపాధిలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నారు. అదే విధంగా పెన్షన్ కూడా కల్పించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్కు… వినతిపత్రం అందజేశారు. నెలలో రెండు, మూడు సార్లు రక్త మార్పిడి చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాటలు, రచనల రూపంలో అందెశ్రీ ఇంకా బ్రతికే ఉన్నారంటున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. చదువు లేకపోయినా, ఆయన గొప్ప స్థాయికి ఎదిగారని చెప్పారు. ప్రతి ఒక్కరూ అందెశ్రీని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు ఈటల రాజేందర్. అందెశ్రీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి గుర్తింపు ఇచ్చిందని అన్నారు.
కడపలోని రిమ్స్ హాస్పిటల్ వద్ద చైతన్య స్కూల్లో మృతిచెందిన విద్యార్థిని.. మృతదేహాన్ని స్కూల్కు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. తమకు న్యాయం జరిగే వరకు చైతన్య పాఠశాల వద్ద మృతదేహంతో ఆందోళన చేస్తామంటున్నారు తల్లిదండ్రులు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వాగ్వాదం నెలకొంది.
మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డిని మాచవరం పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో యువతకు డ్రగ్స్ విక్రయిస్తూ.. మధుసూదన్ రెడ్డి బెంగళూరులో మడ్డిగా చలామణి అవుతున్నాడు . బెంగళూరులో డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేసుకొని యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. మడ్డి స్వస్థలం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె.
సాహిత్య లోకానికి అందెశ్రీ మరణం తీరని లోటు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల గుండె చప్పుడును తన పాటలతో వినిపించాడని గుర్తు చేశారు. అందుకే కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడని చెప్పాడు. పోరుయాత్రలో తనతో పాటు అందెశ్రీ చాలా కాలం గడిపారని కిషన్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్, తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. రోడ్డు ప్రమాదాలపై వివరణాత్మక నివేదికలను సమర్పించాలని ఆదేశించింది. జస్టిస్ జె.కె. మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం సుప్రీంకోర్టులో విచారణ జరిపింది.
కరీంనగర్ కలెక్టరెట్లో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన కుటుంబం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. 70 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న భూమిని కొందరు నకిలీ పట్టాలు సృష్టించి ఆక్రమించుకుంటున్నారని చెబుతున్నారు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తిరుమల పరకామణి కేసులో సీఐడీ అధికారులు హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపడుతున్నారు. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో ఐదు బృందాలుగా ఏర్పడి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు విచారించారు.
అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్. అందెశ్రీ తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అని, ఆయన ఉద్యమ లక్షణాలు, పోరాట పటిమ, రచనలు, పాటలు ప్రస్తుత సమాజానికి, యువతకు ఎంతో స్ఫూర్తి అన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి, శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అని తెలిపారు.
తిరుమలలోని శ్రీవారి మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అపచారంపై ప్రశ్నించిన భక్తులను సిబ్బంది బెదిరించినట్లు తెలుస్తోంది. టీటీడీ విజిలెన్స్ వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తాయి.
బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని PGRS హల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ భావన అర్జీలను స్వీకరించారు.
గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు నల్ల కండువాలతో ఆందోళనకు దిగారు. 100 శాతం సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని, జాబితాను సవరించి, అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆమరణ దీక్ష చేస్తామని అన్నార్ బాబు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర గీతం జయజయహే రచయిత అందెశ్రీ మృతి పట్ల మాజీ ఎంపీ, బీజేపీ నేత సీతారాం నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని, అందెశ్రీ రచనలు ఉద్యమానికి ఊపిరి పోసి, ప్రజల్లో ఆత్మగౌరవ స్ఫూర్తిని నింపాయని కొనియాడారు.
గుంటూరులోని ఐటీసీ హోటల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వాటర్ షెడ్స్ అభివృద్ధి సదస్సులో పాల్గొన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో ఏపీ ముందుంటుందని తెలిపారు. భూగర్భ జలాల పెంపు, నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా వాటర్ షెడ్స్ 3.0ను సమర్థవంతంగా అమలు చేస్తామని ప్రకటించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా వానాకాలం వరి కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాల వారీగా మొత్తం 1013 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు ఇబ్బంది పడకుండా గన్నీ బ్యాగులు, టార్పాలిన్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటూ, దళారులకు అమ్మవద్దని అధికారులు హెచ్చరించారు.
స్పైస్జెట్ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్లలో ఒకదానిలో సాంకేతిక సమస్య తలెత్తింది. గుర్తించిన పైలట్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం విమానాన్ని కోల్కతా ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ చేశారు. విమానం ముంబై నుంచి కోల్కతాకు వచ్చింది.
ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. బీహార్.. పట్నా రెవెన్యూ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మనాస్ గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లకు కీలక సూచనలు చేశారు. టోర్నీకి మూడు నెలలే ఉందని.. ఫిట్నెస్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్లేయర్స్కు సూచించారు. ఈ టోర్నీ భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.
డోనాల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రసారం చేసినందుకు బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవి, న్యూస్ డివిజన్ సీఈవో డెబోరా టర్నెస్ రాజీనామా చేశారు. క్యాపిటల్ హింసకు ట్రంప్ పిలుపు ఇచ్చినట్లు డాక్యుమెంటరీలో ఎడిట్ చేయడం ఈ వివాదానికి కారణమైంది.