YS Sharmila Protest: వైఎస్సార్ కడప జిల్లాలో అరటి రైతుల సమస్యలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అరటి గెలలతో లోడ్ చేసిన వాహనాన్ని ఆమె స్వయంగా నడుపుకుంటూ కలెక్టరేట్కు వెళ్లారు. అనంతరం జాయింట్ కలెక్టర్ను కలిసి రైతుల గోడును వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాయలసీమ ప్రాంతం అరటి సాగుకు నిలయమని.. దేశంలోని మొత్తం ఉత్పత్తిలో 50 శాతం ఇక్కడే జరుగుతోందని షర్మిల గుర్తు చేశారు. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పండుతున్న జీ9 రకం అరటికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్నప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో టన్ను ధర రూ. 25 వేలు ఉంటే.. మార్చి నాటికి అది రూ. 7 వేలకు పడిపోవడం దారుణమన్నారు. ఇరాన్ యుద్ధం, మహారాష్ట్ర నుండి దిగుమతులు పెరగడం వల్ల ఇక్కడి రైతులకు నష్టం వాటిల్లుతోందని వివరించారు.
జగన్ మోహన్ రెడ్డి హయాంలో అరటి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుపై జరిగిన ప్రచారమంతా ఎన్నికల స్టంట్ అని షర్మిల విమర్శించారు. 2023లోనే పూర్తి కావాల్సిన కోల్డ్ స్టోరేజీని కేవలం ఎన్నికల కోడ్ వస్తుందన్న భయంతో 2024 మార్చి 11న హడావుడిగా ప్రారంభించారని ఆరోపించారు. ఆనాడు ప్రారంభించింది కేవలం ఒక షెడ్డు మాత్రమేనని.. అక్కడ ఇప్పటివరకు ఒక్క అరటి గెలను కూడా ప్రాసెస్ చేయలేదని ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించిన రూ. 9 కోట్ల బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని వెల్లడించారు. రైతులకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్.. ప్రాసెసింగ్ ప్లాంట్లు లేకపోవడం వల్లే పంటను పొలాల్లోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తోందని మండిపడ్డారు.
ఆస్తుల వ్యవహారంలో తనపై జరుగుతున్న ట్రోలింగ్పై షర్మిల ఘాటుగా స్పందించారు. వైఎస్సార్ భార్యగా విజయమ్మ ఇచ్చిన లేఖ వైఎస్సార్ అభిమానులకు సుప్రీంకోర్టు తీర్పు లాంటిదని పేర్కొన్నారు. ఆస్తులపై మాట్లాడవద్దని తల్లి చెప్పిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటం వారి సంస్కారానికి నిదర్శనమన్నారు. జగన్ టీం అనవసరంగా తమను టార్గెట్ చేస్తోందని.. తాము ఎవరినీ కుక్కలు అనలేదని స్పష్టం చేశారు. రైతుల కోసం తాము పోరాడుతుంటే అవాస్తవాలతో దాడులు చేయడం సరికాదని హితవు పలికారు.
అరటి రైతులకు ప్రభుత్వం తక్షణమే రూ. 12 వేల కనీస మద్దతు ధర ప్రకటించాలని షర్మిల డిమాండ్ చేశారు. 2023లో ప్రకటించిన రూ. 173 కోట్ల బీమా పరిహారం ఇంతవరకు రైతులకు అందలేదని.. ధరల స్థిరీకరణ నిధిని వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. నకిలీ పిలకల వల్ల రైతులు నష్టపోకుండా నాణ్యమైన మొక్కలను ప్రభుత్వమే సరఫరా చేయాలని సూచించారు. మార్కెట్ సపోర్ట్ సిస్టమ్ లేకపోతే రాయలసీమ రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.
Read Also: షర్మిల హాట్ కామెంట్స్.. జవాబు చెప్పే దమ్ము ఉందా? సైతాన్ సైన్యంతో ప్రచారమా?