YS Sharmila: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆంధ్రప్రదశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. MGNREGA పరిరక్షణ యాత్రలో భాగంగా పీలేరు నియోజక వర్గం కలికిరి వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ అమెరికా చేతిలో బానిసగా మారారని ధ్వజమెత్తారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు సున్నా చేయడం దారుణమన్నారు. ఇది అమెరికానే పబ్లిక్ గా ప్రకటించిందని పేర్కొన్నారు.
రైతులను మోసం చేసినట్లు కాదా?
అమెరికా నుంచి దిగుమతయ్యే పాలు, నూనెలు, మాంసం, పనిముట్లు దిగుమతులపై ఇక పన్నులు ఉండటం లేదని వైఎస్ షర్మిల అన్నారు. ఇదే జరిగితే మన రాష్ట్ర రైతుల సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. మన రాష్ట్ర రైతులు పండించిన పంటలకు విలువ ఏముంది? అని నిలదీశారు. ఇది మన దేశ రైతులను మోసం చేసినట్లు కాదా? అని షర్మిల మండిపడ్డారు. ఇది రైతులను హింసించినట్లు కాదా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అయితే మన రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండని షర్మిల అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోదీ కుట్రలు
MGNREGA పథకంలో మార్పుల గురించి ప్రస్తావిస్తూ ప్రధాని మోదీపై మరోమారు షర్మిల విరుచుకుపడ్డారు. ‘ఉపాధి హామీ పథకంపై మోడీ కుట్రలు చేశారు. ఉపాధి హామీ పథకం పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. YSR ముఖ్యమంత్రిగా పథకాన్ని సక్సెస్ చేశారు. YSR అమలు చేసిన తీరు దేశానికి ఆదర్శం. ఉపాధి హామీ విధివిధానాలు రూపకల్పన జరిగింది ఏపీలోనే. 2014 నుంచి పథకానికి శని గ్రహం పట్టుకుంది. ప్రతి ఏడాది జాబ్ కార్డులు తొలగిస్తున్నారు’ అని షర్మిల ఫైర్ అయ్యారు.
5 ఏళ్లలో 50 లక్షల కార్డులు తొలగింపు
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏపీలో ఒకప్పుడు కోటి 10 లక్షల కార్డులు ఉండేవని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. గడిచిన 5 ఏళ్లలో 50 లక్షల కార్డులు ఏపీలో తొలగించారని ఆరోపించారు. ‘గత ఏడాదిలోని 18 లక్షల కార్డులు తొలగించారు. MGNREGA కింద 100 శాతం నిధులు కేంద్రం ఇచ్చేది. పని అడిగిన వెంటనే పని కల్పించే చట్టం మన్రేగా. మోదీ తెచ్చిన VB-G RAM G చట్టం అక్రమ చట్టం’ అని షర్మిల విమర్శించారు.
రాష్ట్రాలకు సిగ్గుచేటు
కేంద్రం తీసుకొచ్చిన గ్రామ్ జి చట్టం లో పని అడిగే హక్కు ఇక కేంద్రం అధీనంలో ఉంటుందని షర్మిల పేర్కొన్నారు. ‘గ్రామసభలు నిర్ణయించే అధికారం కేంద్రం తీసేసింది. గ్రామ్ జి చట్టం రాష్ట్రాలపై పెను భారం. 60:40 శాతం నిధుల సమీకరణ కింద రాష్ట్రాలపై భారం మోపడం అన్యాయం. రాష్ట్రంపై ఏడాదికి 5 వేల కోట్ల భారం పడుతుంది. మన్రేగా కింద 5 వందల కోట్లు కేటాయించే రాష్ట్రానికి 5 వేల కోట్లు కావాలి. ప్రస్తుతం ఏపీ 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. జగన్, బాబు కలిసి అప్పుల కుప్ప చేశారు. గ్రామ్ జి చట్టానికి బాబు మద్దతు పలకడం సిగ్గుచేటు’ అని షర్మిల విరుచుకుపడ్డారు.