Ysrcp Politics: ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా? కచ్చితంగా తాము వస్తామని వైపీసీ పెద్దలు ఎలా చెబుతున్నారు? కేవలం హైప్ కోసమే ఆ విధంగా చెబుతున్నారా? ఈ విషయంలో మీడియాకు సజ్జల మసాలా ఇస్తున్నారా? ఎందుకు ఆ పార్టీలో కొందరు నేతలు.. ఆయన వ్యవహరశైలిపై భగ్గుమంటున్నారు? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి.
వైసీపీ కోటి సంతకాల సేకరణ
ఈ మధ్యకాలంలో వైసీపీ ఓ విధమైన ప్రచారం మొదలుపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, 2029 ఎన్నికల్లో కచ్చితంగా తాము అధికారంలోకి వస్తామని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు కొందరు నేతలు. దీనికి సంబంధించి అస్త్రాలను ఇప్పటి నుంచి సిద్ధం చేస్తోంది ఆ పార్టీ.
వైసీపీలో పైకి నేతలు ఆ విధంగా చెబుతున్నా, దిగువస్థాయిలో పరిస్థితి వేరేగా ఉందని అంటున్నారు కొందరు నేతలు. కార్యకర్తలు, దిగువ స్థాయి నేతలతో అధినేత సమావేశాలు పెట్టి మాట్లాడిన సందర్భం లేదని అంటున్నారు. దీనివల్ల కేడర్ డీలా పడిందని అంటున్నారు. అందుకు ఉదాహరణ ఇటీవల ఆ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.
మీడియా మసాలా ఇచ్చిన సజ్జల
మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్మాణంపై వైసీపీ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టింది. విచిత్రం ఏంటంటే ఒక్కొక్కరు రెండు లేదా మూడు సంతకాలు పెట్టినట్టు ఆఫ్ ద రికార్డులో నేతల మధ్య గుసగుసలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై బుధవారం సాయంత్రం మీడియా ముందుకొచ్చారు వైసీపీ మాస్టర్ మైండ్ సజ్జల రామకృష్ణారెడ్డి.
మీడియాకు కాసింత మసాలా ఇచ్చేశారు సజ్జల. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు వద్దంటూ సంతకాలు సేకరించామన్నారు. ఈ సంతకాలు ప్రజల నుంచే సేకరించామని ఇందులో ఎలాంటి అపోహాలకు తావులేదన్నారు. అంతేకాదు మరో విషయం కూడా చెప్పారు. కోటి సంతకాలు సేకరించినట్టు వెల్లడించారు.
ALSO READ: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. మరొకరు గవర్నర్ వద్దకు, మేటరేంటి?
ఇక్కడే కొందరు వైసీపీ నేతలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కోటి 32 లక్షల ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం కోటి మంది నుంచి సంతకాలు సేకరించడమంటే తమ ఓటర్ల సంఖ్యను అమాంతంగా తగ్గించుకోవడమేనని అంటున్నారు. ఈ విధంగా వైసీపీని డీలా పరుస్తున్నారా? అంటూ కొందరు నేతలు మాట్లాడుకోవడం మొదలైంది.
ఎలాంటి విషయాలు మీడియా ముందు ఎలా చెబుతారని అంటున్నారు. వైసీపీని టీడీపీ కార్యకర్తలు సోషల్మీడియా వేదికగా ఆట ఆడుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ మారలేదని, ఆ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపలేదంటున్నారు. ఇంతకీ వైసీపీని నేతలు ఏం చేస్తున్నారు? వైసీపీపై ఆ మధ్య విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోటరీ చేరిందని వ్యాఖ్యానించారు. ఆయన మాటలను ఈసందర్భంగా నేతలు గుర్తు చేస్తున్నారు.