Malkajgiri Incident: మల్కాజ్గిరిలో సంచలనం సృష్టించిన చిన్నారి మృతి కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణ ఘటన సమాజంలో మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ఉంది. ఒక చిన్న సెల్ఫోన్ కోసం కన్న కూతురినే అంతం చేసిన ఓ తల్లి.. ఈ ఘటన అసలు ఏం జరిగింది?
పూర్తి వివరాల్లోకి వెళితే.. మల్కాజ్గిరి పరిధిలోని ఒక అపార్ట్మెంట్లో ఓ తల్లి తన మూడేళ్ల చిన్నారి షారోనా మేరీని బాల్కనీ నుండి కిందకు తోసేసింది. అయితే ఈ ఘటన వెనుక కేవలం సెల్ఫోన్ కారణం మాత్రమే కాదు, ఆ ఇంట్లో ఉన్న విపరీతమైన గొడవలు, తల్లి మోనాలీసా ప్రవర్తన కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. నిత్యం ప్రశాంతంగా ఉండాల్సిన ఇల్లు ఆ రోజు తెల్లవారుజామున ఒక భయంకరమైన హత్యకు వేదికైంది.
అయితే పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం, హత్యకు ముందు రోజు రాత్రి భర్త డేవిడ్తో మోనాలీసా తీవ్రంగా గొడవ పడింది. ఆ గొడవ ఎంతటి స్థాయికి వెళ్లిందంటే, రాత్రంతా ఆమె ఇంట్లో అరుస్తూ, కేకలు వేస్తూ భర్తను, తన తల్లిని, పిల్లలను ఎవరినీ నిద్రపోనివ్వలేదు. తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్న మోనాలీసా, తెల్లవారుజామున కూడా అదే కోపాన్ని ప్రదర్శించింది. ఇంట్లో వాతావరణం ఉద్రిక్తంగా ఉన్న సమయంలోనే చిన్నారి షారోనా మేరీ తెలియక తల్లి ఫోన్తో ఆడుకోవడం మొదలుపెట్టింది.
ఆగ్రహంతో ఊగిపోతున్న మోనాలీసా, పాప చేతిలో తన సెల్ఫోన్ చూసి నియంత్రణ కోల్పోయింది. “నా ఫోన్తోనే ఆడతావా?” అంటూ బిడ్డపై విరుచుకుపడింది. బెడ్రూమ్లో ఆడుకుంటున్న చిన్నారిని బలవంతంగా లాక్కెళ్లింది. ఈ సమయంలో ఇంట్లోనే ఉన్న మోనాలీసా తల్లి తన కూతురిని వారించేందుకు ప్రయత్నించింది. కానీ, తనను అడ్డుకోవద్దని, నిన్ను చంపేసి నేను కూడా చచ్చిపోతానంటూ తల్లిని బెదిరించి, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పాపను బాల్కనీ నుండి కిందకు విసిరేసింది.
ఈ ఘోరం జరుగుతున్న సమయంలో బెడ్రూమ్లో నిద్రపోతున్న భర్త డేవిడ్, భార్య, అత్తగారి అరుపులు విని బయటకు పరిగెత్తుకు వచ్చారు. కానీ ఆయన బాల్కనీ వద్దకు చేరుకునే లోపే జరగకూడని అనర్థం జరిగిపోయింది. తన కళ్లముందే కన్నకూతురు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే పాపను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై డేవిడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో మోనాలీసాకు కోపం చాలా ఎక్కువని, చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు పడేదని తేలింది. చిన్నారి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత పోలీసులు ఆమెను అధికారికంగా అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
Also Read: ఎల్ఐసీ ఆఫీస్లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
సాంకేతిక పరికరాల పట్ల పెరిగిన వ్యామోహం, క్షణికావేశం ఒక పచ్చని కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తుందో అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక చిన్నారి ప్రాణం పోవడమే కాకుండా, తల్లి జైలు పాలవ్వడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇప్పటికైన పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత ఓపికగా ఉండాలో, మానసిక ఒత్తిడి ప్రాణాంతకంగా ఎలా మారుతుందో ఈ ఘటన తెలియజేస్తుంది.