అధికారానికి దూరమైనా వైఎస్సార్ సీపీ పార్టీలో మాత్రం కొట్లాటలు, కుమ్ములాటలు ఏమాత్రం తగ్గడం లేదు. కార్యక్రమం ఏదైనా వర్గపోరు ముందు.. ఆ తర్వాతే అధిష్టానం మాట అన్నట్టు కొందరు నేతల తీరు ఉన్నది. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఓ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కూటమి సర్కార్ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరించనున్నదని ఆరోపిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. గత కొన్ని రోజులుగా ఈ సంతకాల సేకరణ ప్రోగ్రామ్ కొనసాగుతున్న తరుణంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు మరోమారు బయటపడింది.
సాధారణంగా నేతలు అధికారం, పదవి కోసం కొట్లాడుతుంటారు. అది కామన్. పార్టీ పవర్లో ఉన్నప్పుడే పదవులు, సీట్ల కోసం పోటీ ఉంటుంది.తద్వారా నేతల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. కానీ, అధికారం లేనప్పుడు అందరితో కలివిడిగా ఉండి పార్టీ విజయం కోసం నిత్యం తాపత్రయపడుతుండాలి. కానీ, వైఎస్సార్ సీపీలో అలాంటివి మచ్చుకైనా కనిపించడం లేదని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకులు నిర్వహించిన బైక్ ర్యాలీనే అందుకు బెస్ట్ ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం వైసీపీ బైక్ ర్యాలీ నిర్వహిస్తుండగా.. ర్యాలీలో ముందుకు వెళ్లాలన్న విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. డిప్యూటీ మేయర్ గోగటం విజయభాస్కర్ రెడ్డి, కార్పొరేటర్ సాకే చంద్ర మధ్య వివాదం తలెత్తగా పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు.అనంతరం వైసీపీ కార్యాలయం నుంచి బుక్కరాయసముద్రం వరకు ర్యాలీ చేపట్టారు.కాగా, అధిష్టానం పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించడం వరకూ ఓకే. తమదే నెగ్గాలి? అవతలి వ్యక్తి తగ్గాలి? అనుకుంటే అంతటా అది వర్కౌట్ కాకపోవచ్చు.
ప్రజాహితం కోసం చేపట్టాల్సిన బైక్ ర్యాలీని సొంత పంచాయితీ కోసం వైసీపీ నేతలు వినియోగించుకోవడాన్ని కూటమి శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. బైక్ ర్యాలీ వలన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. ఇదేమీ పట్టించుకోకుండా వైసీపీ నేతలు రోడ్డు మీద బాహాబాహీకి దిగడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.అధికారం కోల్పోయిన వారు ప్రతిపక్షంలో బాధ్యతాయుతంగా ఉండకుండా, జనాల ఎదుట గొడవలకు దిగుతూ పార్టీకి ఉన్న ఇజ్జత్ తీయడం కాకపోతే ఏంటని నిలదీస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ సీఎం జగన్ సీరియస్గా తీసుకుని పార్టీ పరువు తీసే వారికి తగిన బుద్ది చెప్పాలని వైసీపీ శ్రేణులు సైతం డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలాఉండగా, నేటితో మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రక్రియ ముగియగా.. ఆ పత్రాలను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించినట్లు సమాచారం.వీటిని రాష్ట్ర గవర్నర్కు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో అందజేస్తారని తెలుస్తోంది. దానిపై గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఆసక్తిగా మారింది.