Tirumala Laddu Adulterated Ghee Case: ఎట్టకేలకు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై నోరు విప్పారు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదన్నారు. లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కీలక ప్రశ్నలు సంధించారు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. లడ్డు వ్యవహారాన్ని రాజకీయ అంశంగా మార్చారని అన్నారు. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతో సుప్రీంకోర్టులో కేసు వేశామని అననారు. తాను తప్పు చేస్తే ఎందుకు న్యాయస్థానానికి వెళ్తానని ప్రశ్నించారు.
లడ్డు ప్రసాదంలో కలిసింది జంతువుల కొవ్వా? వెజిటబుల్ ఆయిలా? అనేది ఇప్పటివరకు స్పష్టత రాలేదన్నారు. నెయ్యి ట్యాంకర్లు పరిశీలించిన తరువాత లడ్డు తయారీకి నెయ్యిని వినియోగించడం జరుగుతుందన్నారు. లాబ్ టెస్టులు జరిగినప్పుడు లడ్డు తయారీకి కల్తీ నెయ్యి ఎలా కలుస్తుందన్నది ఆయన వాదన.
లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమే-వైవీ సుబ్బారెడ్డి
2024 జూన్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉందని, మరి ఆరోపణలు ఎవరిపై చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. 2024 ఆగస్టులో టీడీపీ అధికారంలో ఉందని, అప్పుడు కల్తీ ట్యాంకర్ల నెయ్యిని లడ్డు తయారీకి వినియోగిస్తే ఆ తప్పు ఎవరిదన్నది ఆయన ప్రధాన ప్రశ్న. 2019-24 మధ్యకాలంలో కల్తీ నెయ్యితో లడ్డూల తయారీ జరిగిందని తప్పుడు ప్రచారం జరిగిందన్నారు.
ఓ వైపు సిట్ దర్యాప్తు చేస్తుంటే, కల్తీ నెయ్యితో లడ్డూల తయారీ చేశారని మీడియాలో కథనాలు దురదృష్టకరమన్నారు. ఈ విషయంలో మీడియా సంయమనం పాటించాలన్నారు. కిలో నెయ్యి 326 కొనుగోలు చేశామని, తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ప్రచారం జరుగుతుందన్నారు.
ALSO READ: విమానంలో మంత్రి లోకేష్ టూర్లు, ఆర్టీఐలో కీలక నిజాలు
2014 లో చంద్రబాబు హయంలో రూ. 270 రూ కిలో నెయ్యి కొనుగోలు చేసి లడ్డు తయారీ చేశారని, అప్పుడు కల్తీ జరిగినట్లేనా? టీడీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోళ్లు- కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. టీటీడీ ద్వారా లాభ పడాలని తనకుగానీ, కుటుంబానికి అస్సలు లేదన్నారు. లడ్డు విషయంలో సిట్ విచారణ చేస్తున్నప్పుడు ఇవే అంశాలు చెప్పానని వివరించారు.
రాజకీయాలకు ఆలయాలను వాడుకుంటున్నారని, లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆలయ ప్రతిష్ట పెంచేలా పని చేశానని, దేవుడి విషయంలో ఏ తప్పు చేయలేదన్నారు. తాను 30 సార్లు అయ్యప్ప మాల వేశానని, తనపై తప్పుడు నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా హయాంలోనే టీటీడీ ఆస్తుల పై శ్వేత పత్రం విడుదల చేశామన్నారు. శ్రీవారి ఆదాయాన్ని కాపాడినా మా పై నిందలు వేస్తున్నారని తెలిపారు. L1,L2 దర్శనాలు రద్దు చేశామని, పారదర్శకంగా ఉండేందుకు శ్రీవాణి దర్శన విధానం తెచ్చామన్నారు.