YV Subba Reddy: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీకి గురైందనే అంశం గత కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాస్తవాలను వెలికితీయడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) నియమించింది. తాజాగా ఈ సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో సమర్పించిన తుది ఛార్జ్ షీట్లోని అంశాలపై వైసిపి రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీ వేదికగా కీలక వివరణ ఇచ్చారు.
సిట్ సమర్పించిన ఫైనల్ ఛార్జ్ షీట్లో నెయ్యిలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయిందని, అయితే అందులో ఎక్కడా జంతువుల కొవ్వు (Animal Fat) లేదని స్పష్టంగా చెప్పారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని దీని ద్వారా రుజువైందని ఆయన ధ్వజమెత్తారు. స్వామివారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారంటూ తప్పుడు ప్రచారం చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులను ఆందోళనకు గురిచేశారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా గతంలో వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
2024 జూలైలో సరఫరా అయిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందా లేదా అనే అంశంపైనే ప్రధానంగా విచారణ జరిగిందని, ఆ నెయ్యిలో కూడా ఎటువంటి జంతువుల ఫ్యాట్ లేదని సిట్ తేల్చి చెప్పిందని సుబ్బారెడ్డి వివరించారు. నెయ్యిలో కల్తీ జరిగినప్పటికీ అది వేరే రకమైన కల్తీ అని, కానీ లడ్డూ ప్రసాదం అపవిత్రం అయిందన్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్ మోహన్ రెడ్డి పైన, తన పైన అవినీతి ఆరోపణలు మోపారని, ఈ అసత్య ప్రచారాలపై చట్టపరంగా కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.
తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కొంతమంది వ్యక్తులను తన పీఏలుగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఇవన్నీ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన ఈ విచారణ ద్వారా నిజా నిజాలు భక్తుల ముందు నిలిచాయని, ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు.
Read Also: Vizag-Janasena: జనసేన, టీడీపీ మధ్య కోల్డ్ వార్..!