E20 Petrol vs Older Cars: దేశంలో ఇథనాల్ మిశ్రమం ఉన్న E20 పెట్రోల్ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం వేగంగా విస్తరిస్తోంది. ఇంధన దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, 2023కు ముందు తయారైన కొన్ని వాహనాల యజమానులకు ఈ పెట్రోల్ ఆందోళన కలిగిస్తోంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నిర్వహించిన అధ్యయనంలో, E10 ఫ్యూయల్ కి అనుకూలంగా రూపొందించిన పాత వాహనాల్లో E20 పెట్రోల్ పోయడం వల్ల కొన్ని రబ్బరు భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని తెలుస్తోంది.
ARAI అధ్యయనం ప్రకారం, హోసులు, గాస్కెట్లు, సీల్స్, ఓ రింగ్ లు లాంటి ఇంధన వ్యవస్థలోని రబ్బరు భాగాలు ఎక్కువకాలం E20 ఇంధనం వాడితే అరిగిపోయే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో వాటిని మార్చాల్సిన అవసరం కూడా రావచ్చని తెలిపింది. అయితే, లోహ భాగాలకు మాత్రం ఎలాంటి నష్టం కలిగే అవకాశం లేదని అధ్యయనం తెలిపింది. ARAI ఈ పరిశోధనను 2022లో ప్రారంభించింది. ఇందులో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ పై అధ్యయనం చేసింది. వీటిలో కొన్ని ఇంజిన్లు ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేయగా, ఒక పరీక్షలో ఎక్కువసేపు వినియోగించిన తర్వాత ఎగ్జాస్ట్ వాల్వ్ లో సమస్య గుర్తించినట్లు సమాచారం. అయితే అది పూర్తిగా E20 కారణంగానే జరిగిందా? లేదంటే ఇతర కారణాలున్నాయా? అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదని వెల్లడించింది.
ARAI అధ్యయనం ప్రకారం, E20 పెట్రోల్ వాడిన వాహనాల్లో ఇంధన వినియోగం E10తో పోలిస్తే సుమారు 2 నుంచి 6 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఎక్కువకాలం వాడిన తర్వాత కొన్ని వాహనాల్లో ఉద్గారాల స్థాయిలో కూడా స్వల్ప మార్పులు కనిపించినట్లు గుర్తించారు. అయినప్పటికీ వాహనం స్టార్ట్ కావడం, నడిచే పనితీరు సాధారణంగానే ఉందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఉన్న చాలా పాత వాహనాలు E10 ఫ్యూయల్ కు అనుకూలంగా తయారయ్యాయి. 2023 తర్వాత తయారైన కొత్త వాహనాలను మాత్రం E20 ఫ్యూయల్ కు అనుగుణంగా రూపొందిస్తున్నారు. 2025 నుంచి కొత్త వాహనాలు E20 ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తున్నాయి.
ఆయిల్ దిగుమతులను తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, రైతులకు సపోర్టు ఇవ్వడం కోసం ప్రభుత్వం E20 వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. మరోవైపు, పాత వాహనాల యజమానులు మాత్రం దీర్ఘకాలంలో ఇంధన వ్యవస్థపై ప్రభావం ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల సూచనల ప్రకారం, 2023కు ముందు మోడల్ కార్లు, బైక్లు ఉన్నవారు వాహనంలోని ఫ్యూయల్ హోసులు, సీల్స్, గాస్కెట్లు లాంటి భాగాలను తరచుగా చెక్ చేసుకోవడం మంచిది అంటున్నారు. వాహన తయారీ సంస్థ సూచనల ప్రకారం ఇంధనాన్ని ఉపయోగించడం మరింత సురక్షితం అంటున్నారు. E20 పెట్రోల్ పర్యావరణానికి ప్రయోజనకరమైనదే అయినప్పటికీ, పాత వాహనాల విషయంలో కొంత జాగ్రత్త అవసరమని ఈ అధ్యయనం సూచిస్తోంది.
Read Also: లిథియం ఐరన్ ఫాస్ఫేట్ vs నికెల్ మాంగనీస్ కోబాల్ట్.. ఈవీకి ఏ బ్యాటరీ బెస్ట్?