E85 Flex Fuel Benefits: భారత్లో ఇథనాల్ ఆధారిత ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు చర్యలు వేగవంతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ ఢిల్లీలో అందుబాటులోకి వచ్చింది. త్వరలో దేశంలోని పలు నగరాలకు విస్తరించనుంది. అయితే, దేశ వ్యాప్తంగా E85 ఫ్యూయల్ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ E85 అంటే ఏమిటి? సాధారణ పెట్రోల్తో పోల్చతే ఎలా భిన్నంగా ఉంటుంది? అనే ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
E85 అనేది 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో తయారయ్యే ప్రత్యేక ఇంధనం. సాధారణంగా మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న E20 పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మాత్రమే ఉంటుంది. కానీ E85లో ఇథనాల్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని ఫ్లెక్స్ ఫ్యూయల్ గా పిలుస్తారు.
ఇథనాల్ ను ప్రధానంగా చెరకు రసం, మొలాసిస్(చెరకు బెల్లం తయారీ తర్వాత మిగిలే ద్రవం), మొక్కజొన్న, ధాన్యాలు లాంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. ముందుగా ఈ ముడి పదార్థాలను ఫెర్మెంటేషన్ ప్రక్రియకు గురిచేస్తారు. ఈ ప్రక్రియలో చక్కెరలు ఆల్కహాల్ గా మారుతాయి. తర్వాత డిస్టిలేషన్ ద్వారా శుద్ధి చేసి ఇథనాల్ ను తయారు చేస్తారు. ఆ ఇథనాల్ను నిర్దిష్ట నిష్పత్తిలో పెట్రోల్తో కలిపి E85 ఇంధనాన్ని సిద్ధం చేస్తారు.
E85 ఫ్యూయల్ వల్ల దేశానికి బోలెడు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. భారత్ తన అవసరాలకు పెద్ద మొత్తంలో ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇథనాల్ వినియోగం పెరిగితే పెట్రోల్ విషయంలో ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. అలాగే దేశీయంగా పండే చెరకు, మొక్కజొన్న లాంటి పంటలకు అదనపు డిమాండ్ ఏర్పడటంతో రైతులకు కూడా లాభం కలుగుతుంది.
పర్యావరణ పరంగా కూడా E85కు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇథనాల్ పునరుత్పాదక ఇంధనం. అంటే, పంటల నుంచి తయారు చేయవచ్చు. అలాగే పెట్రోల్తో పోలిస్తే హానికర ఉద్గారాలు తక్కువగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. వాయు కాలుష్యాన్ని కొంత మేర తగ్గించవచ్చు.
E85కు కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. అన్ని వాహనాల్లో ఉపయోగించలేరు. దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ ఉన్న వాహనాలు అవసరం. ప్రస్తుతం కొన్ని టూ వీలర్, కార్ల తయారీ సంస్థలు ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను అభివృద్ధి చేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఇథనాల్ లో శక్తి సాంద్రత పెట్రోల్ తో పోలిస్తే తక్కువగా ఉండటంతో, మైలేజీ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే దేశ వ్యాప్తంగా E85 అందుబాటులోకి రావాలంటే ఫ్యూయల్ స్టేషన్లు పెరగాల్సిన అవసరం ఉంది.
మొత్తానికి, E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ భారత ఇంధన రంగంలో కీలక మార్పు కానుంది. దిగుమతి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతులకు కొత్త అవకాశాలు కల్పించడం, పర్యావరణానికి మేలు చేయడం వంటి కారణాలతో ఈ ఇంధనానికి ప్రాధాన్యం పెరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో E85 వినియోగం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.