MG Comet EV Gets Costlier in July 2026: దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువైన చిన్న సైజు ఈవీలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి కార్లలో ఎంజీ కామెట్ ఈవీ ముందుంటుంది. తక్కువ ధర, ఆకర్షణీయమైన డిజైన్, ఈజీ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ తో ఈ కారు ఇప్పటికే చాలా మందిని ఆకట్టుకుంది. అయితే, ఇప్పుడు ఈ కారును కొనాలని భావిస్తున్న వారికి కంపెనీ షాక్ ఇచ్చింది. ఎంజీ కామెట్ ఈవీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జేఎస్డబ్ల్యూ-ఎంజీ మోటార్ ఇండియా ఇటీవల తన వాహనాల ధరల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సైబర్స్టర్, ఎం9, విండ్సర్ ఈవీ లాంటి మోడళ్ల ధరలను సవరించిన కంపెనీ, ఇప్పుడు అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు కామెట్ ఈవీ ధరలను కూడా పెంచింది.
తాజా ధరల ప్రకారం, కామెట్ ఈవీ ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ వేరియంట్ల ధరలు ఒక్కో దానిపై రూ.17,000 వరకు పెరిగాయి. ఇక ఎక్స్ క్లూజివ్ వేరియంట్ పై మాత్రం రూ.7,000 పెంపు అమల్లోకి వచ్చింది. దీంతో కామెట్ ఈవీ కొనాలనుకునే వారు గతంతో పోలిస్తే కొంత ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ధరలు పెరిగినా కూడా కామెట్ ఈవీ ఇప్పటికీ భారత మార్కెట్లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.7.80 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్కు రూ.10.07 లక్షల వరకు ఉంది.
ఈ కారు మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్స్క్లూజివ్. వినియోగదారుల అవసరాలను బట్టి తమకు నచ్చిన వేరియంట్ ను ఎంచుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కంపెనీ అందిస్తున్న BaaS ప్రోగ్రామ్ ద్వారా కూడా ఈ కారును కొనుగోలు చేయవచ్చు. ఈ విధానంలో బ్యాటరీని విడిగా రెంటెల్ ప్రాతిపదికన తీసుకోవడం వల్ల ప్రారంభ కొనుగోలు ఖర్చు కొంత తగ్గే అవకాశం ఉంటుంది.
ఎంజీ కామెట్ ఈవీ ప్రధానంగా నగరాల్లో ప్రయాణించే వారికి ఈ కారు అనుకూలంగా ఉంటుంది. చిన్న పరిమాణం కారణంగా ట్రాఫిక్ లో ఈజీగా నడిపే అవకాశం ఉంటుంది. పార్కింగ్ కూడా ఈజీగా చెయ్యొచ్చు. అందుకే మొదటిసారి ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి, ఫ్యామిలీలో రెండో కారుగా ఒక ఈవీని తీసుకోవాలనుకునే వారు దీనిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
Read Also: బడ్జెట్ లో బెస్ట్ రేంజ్.. రూ.15 లక్షల లోపు టాప్ ఈవీ కార్లు ఇవే!