New Two Wheeler Safety System: దేశంలో బైక్ ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యువత సోషల్ మీడియా కోసం చేసే స్టంట్లు, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మోటార్ సైకిళ్లు, స్కూటర్ల కోసం సరికొత్త 3 అంచెల భద్రతా వ్యవస్థను తీసుకురావాలని భావిస్తోంది. ఈ కొత్త వ్యవస్థతో రైడర్లు వాహనాన్ని సురక్షితంగా నడపేలా చేయనుంది. హ్యాండిల్ బార్ పై రెండు చేతులు ఉంచకుండా ప్రయాణించడం, మొబైల్ ఫోన్ వాడుతూ రైడ్ చేయడం లాంటి ప్రమాదకర విన్యాసాలను అరికట్టడమే లక్ష్యంగా దీనిని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన చర్చల దశలో ఉన్నప్పటికీ, అమలులోకి వస్తే టూ వీలర్స్ ప్రమాదాలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది.
ఈ వ్యవస్థలో మొదటి దశ ఇగ్నిషన్ కంట్రోల్. రైడర్ రెండు చేతులను హ్యాండిల్ బార్ పై సరిగ్గా ఉంచినట్లు సెన్సార్లు గుర్తించిన తర్వాతే వాహనం స్టార్ట్ అయ్యేలా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం హ్యాండిల్ బార్లో ప్రత్యేక గ్రిప్, ప్రెజర్ సెన్సార్లను అమర్చే అవకాశం ఉంది. దీంతో ప్రయాణం ప్రారంభించే ముందు నుంచే రైడర్ సరైన నియంత్రణలో ఉన్నాడో? లేదో? సిస్టమ్ నిర్ధారిస్తుంది.
రెండో దశలో హెచ్చరిక వ్యవస్థ ఉంటుంది. వాహనం నడుస్తున్న సమయంలో రైడర్ చేతులు హ్యాండిల్ బార్ నుంచి తొలగిస్తే, సిస్టమ్ వెంటనే హెచ్చరికలు జారీ చేస్తుంది. మూడు సెకన్లకు మించి చేతులు లేకుండా వాహనం నడిపితే ఆడియో అలర్ట్ లు, డ్యాష్ బోర్డ్ వార్నింగ్ లు, లైట్ల ద్వారా సిగ్నల్స్ ఇస్తుంది. ప్రమాదకర పరిస్థితులు తలెత్తకముందే రైడర్ అప్రమత్తం కావచ్చు.
మూడో దశ అత్యంత కీలకమైనది. హెచ్చరికలు వచ్చినప్పటికీ రైడర్ చేతులు హ్యాండిల్ బార్ పై పెట్టకపోతే, వాహనం ఆటో మేటిక్ గా వేగాన్ని తగ్గించడం ప్రారంభిస్తుంది. ఎనిమిది సెకన్లకు పైగా హ్యాండ్స్ ఫ్రీ రైడింగ్ కొనసాగితే ఈ ఫీచర్ పని చేస్తుంది. అయితే, ఇది ఒక్కసారిగా బ్రేక్ వేయదు. క్రమంగా వేగాన్ని తగ్గించి రైడర్ మళ్లీ బైక్ ను తన కంట్రోల్ లోకి తీసుకునేలా చేస్తుంది.
ఈ కొత్త భద్రతా వ్యవస్థ అమల్లోకి వస్తే రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వాహనాల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. ఒక్కో మోటార్ సైకిల్, స్కూటర్ ధర రూ.800 నుంచి రూ.2,000 వరకు పెరగవచ్చు. అయినప్పటికీ, ప్రమాదాలను తగ్గించి ప్రాణాలను కాపాడగలిగితే ఈ అదనపు ఖర్చు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు లభిప్రాయపడుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2024లో దేశవ్యాప్తంగా సుమారు 4.68 లక్షల రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో టూ వీలర్ ప్రమాదాలే ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 1.75 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది గాయపడ్డారు.
Read Also: బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? EV కొనుగోలుదారులకు లాభమా? నష్టమా?