Co Living Hostels: స్వేచ్య బ్యూరో: గ్రేటర్ లో నయా కల్చర్ వేళ్లూనుకుంటోంది. కో లివింగ్ హాస్టళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మీకు నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయితో కలిసి ఉండవచ్చు.. అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ నిర్వాహకులు ప్రచారం చేసుకుంటూ మరీ ఈ విష సంస్కృతిని పెంచుతున్నారు. ఒక్కొక్కరి నుంచి నెలకు 25 నుంచి 40వేల రూపాయలు వసూలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. అయితే, హాస్టళ్లలో అసలేం జరుగుతోంది? అన్నదానిపై కనీస దృష్టి కూడా పెట్టటం లేదు. రోజురోజుకు పెరిగిపోతున్న ఈ ధోరణులపై ఫ్యామిలీ కౌన్సిలర్ల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కో లివింగ్ హాస్టల్లో ఉంటున్న యువతి భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న గటన తీవ్ర సంచలనం సృష్టించిన ఈ విషాదం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గచ్చిబౌలిలోని ఎలైట్ కో లివింగ్ హాస్టల్ లో దుర్గ (23), సాయికుమార్ అనే యువకునితో కలిసి ఉంటోంది. దుర్గ ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో పని చేస్తుండగా సాయికుమార్ ఆమెజాన్ లో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి 7.30గంటల సమయంలో దుర్గ హాస్టల్ భవనం అయిదో అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. ఆ సమయంలో దుర్గతోపాటు సాయికుమార్ అదే అంతస్తులో ఉన్నాడు.
విషయం తెలియగానే గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక విచారణలో దుర్గ, సాయికుమార్ ప్రేమలో ఉన్నట్టుగా తెలిసింది. అయితే, కొన్నిరోజులుగా దుర్గను అనుమానిస్తూ సాయికుమార్ తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నట్టుగా తెలియవచ్చింది. మద్యం సేవించి వచ్చి దుర్గను దుర్భాషలాడేవాడని వెల్లడైంది. శనివారం రాత్రి కూడా రెండో అంతస్తులోని గదిలో సాయికుమార్ దుర్గతో గొడవపడినట్టు తెలిసింది. దాంతో దుర్గ అయిదో అంతస్తుకు వెళ్లగా సాయికుమార్ కూడా ఆమె వెనకే పైకి వెళ్లినట్టుగా వెల్లడైంది. అతను చూస్తుండగానే దుర్గ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో పోలీసులు సాయికుమార్ ను అరెస్ట్ చేశారు.
ఇక, కో లివింగ్ హాస్టళ్లలో అసాంఘిక కార్యకలాపాలు కూడా జోరుగా సాగుతున్నట్టు సమాచారం. దీనికి నిదర్శనంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని జెర్నెట్ కో లివింగ్ పీజీ హాస్టల్ ఉదంతాన్ని పేర్కొనవచ్చు. ఈ హాస్టల్ లో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్టుగా తెలిసి ఇటీవల పోలీసులు దాడి చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన కంభం వంశీ దిలీప్, చీరాల వాస్తవ్యుడు మణికంఠ బాలప్రకాశ్ లను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్ తోపాటు ఓజీ కుష్ గంజాయి తీసుకువచ్చి కో లివింగ్ హాస్టల్ లో ఉంటున్న చామకూరి రోహిత్ గౌడ్, ఎం.తరుణ్, మణికంఠ ముచ్చులకు అమ్ముతున్నట్టు తెలియటంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 12గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 7గ్రాముల ఓజీ కుష్ గంజాయితోపాటు ఆరు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. అయితే, బయట పడకుండా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కో లివింగ్ హాస్టళ్లలో విచ్చలవిడిగా జరుగుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసులు ఈ అంశంపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని జనం విజ్ఙప్తులు చేస్తున్నారు.
Also Read: ఫ్యాన్స్కు షాక్.. ‘జాతిరత్నాలు 2’ కి ఆ ఒక్కటి మైనస్ అంటున్న నాగ్ అశ్విన్!