JSW MG మోటార్ ఇండియా.. భారత మార్కెట్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే సరికొత్త SUVని జూలై 16న ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ అధికారికంగా వాహనం పేరును వెల్లడించకపోయినా, ఇది వులింగ్ స్టార్ లైట్ 560 ఆధారంగా రూపొందిన కొత్త మిడ్సైజ్ SUV కానున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మోడల్ ఇప్పటికే భారత రోడ్లపై టెస్టింగ్ వేళ కనిపించింది.
కొత్త మోడల్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేసిన MG, భారత్ లో డ్రైవింగ్ విధానాన్ని ‘ఇంటర్నెట్ ఇన్ సైడ్’ మార్చింది. ఇప్పుడు కొత్త ఎనర్జీ వాహనాల గురించి భారత్ ఆలోచించే విధానాన్ని మార్చే సమయం వచ్చింది” అని ఈ టీజర్ లో చెప్పుకొచ్చింది. ఇక్కడ ‘ఇంటర్నెట్ ఇన్ సైడ్’ అనే పదం 2019లో విడుదలైన హెక్టర్ SUVని గుర్తు చేస్తోంది. హెక్టర్ ద్వారా కనెక్టెడ్ కార్ టెక్నాలజీని మాస్ మార్కెట్ కు పరిచయం చేసిన MG, ఇప్పుడు కొత్త ఎనర్జీ వాహనాల్లో మరో అడుగు ముందుకు వేయాలని చూస్తోంది.
టీజర్ లో “న్యూ ఎనర్జీ వెహికల్” అనే పదంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్ల ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మోడల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలోనే భారత మార్కెట్లో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికల్స్ ను ప్రవేశపెట్టాలని MG ప్రకటించిన నేపథ్యంలో, ఈ కొత్త SUV ఆ ప్రణాళికలో కీలకంగా మారే అవకాశముంది. ఈ SUVని ‘520’ అనే కోడ్ నేమ్ తో పిలుస్తున్నారు. ఇటీవల దీని డిజైన్ పేటెంట్ ను భారత్ లో సబ్ మిట్ చేయగా, టెస్ట్ మ్యూల్స్ కూడా కెమెరాలకు చిక్కాయి. ఇది 5-సీటర్, 7-సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. పరిమాణం పరంగా హెక్టర్ కంటే పెద్దదిగా ఉండనుంది. MG పోర్ట్ ఫోలియోలో అత్యంత ప్రీమియం SUVలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
బాక్సీ స్టైల్, పెద్ద గ్రిల్, LED లైటింగ్, స్క్వేర్ వీల్ ఆర్చ్ లు, పవర్ ఫుల్ రోడ్ ప్రెజెన్స్ తో ఈ SUV ప్రత్యేకంగా కనిపించనుంది. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, నిలువుగా ఉండే టెయిల్ గేట్ డిజైన్, రూఫ్ స్పాయిలర్ లాంటి ఫీచర్లు ఉంటాయి. క్యాబిన్లో 12.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 8.8 అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పలు కంఫర్ట్ ఫీచర్లు అందించే అవకాశం ఉంది. భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కంపెనీ మరిన్ని ఫీచర్లను యాడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ఈ SUV రెండు పవర్ట్రెయిన్ ఆప్షన్లలో లభిస్తోంది. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెర్షన్ లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 197 హెచ్పీ పవర్, 230 ఎన్ ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తూ, పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్లో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ లో 56.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్, 136 హెచ్పీ శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ కొత్త SUV దీపావళికి ముందు భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. మహీంద్రా XUV 7XO, టాటా సఫారీ, టయోటా ఇన్నోవా హైక్రాస్ లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Read Also: స్కోడా పీక్ EV వచ్చేసింది.. 28 నిమిషాల్లో ఛార్జింగ్, 647KM రేంజ్!