New MG 7-Seater Electric SUV Launching: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్ ను మరింత విస్తరించేందుకు JSW MG మోటార్ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ADAPT అనే కొత్త BEV/హైబ్రిడ్ ప్లాట్ ఫారమ్ ను పరిచయం చేసింది. ఈ ప్లాట్ ఫారమ్ ఆధారంగా రూపొందే తొలి మోడల్ 7 సీటర్ ఎలక్ట్రిక్ SUVగా రానుంది. ఈ కొత్త మోడల్ ఆగస్టులో భారత మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త SUV అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న వులింగ్ ఎక్సియన్ ఆధారంగా రూపొందించబడుతోంది. భారత మార్కెట్లో ఈ మోడల్ మహీంద్రా XEV 9Sకు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచే అవకాశం ఉంది.
ఈ ఎలక్ట్రిక్ SUVలో 69 kWh బ్యాటరీ ప్యాక్ను అందించే అవకాశం ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్ను అందిస్తుందని సమాచారం. ఇది లాంగ్ డ్రైవ్లు చేసే వారికి మంచి ఆప్షన్ కానుంది. పనితీరు విషయానికి వస్తే, ముందు చక్రాలకు శక్తిని అందించే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ను ఇందులో అమర్చనున్నారు. ఈ మోటార్ గరిష్టంగా 201 హార్స్ పవర్, 310 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో మంచి యాక్సిలరేషన్ తో పాటు స్మూత్ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ అందించనుంది.
క్యాబిన్ లో కూడా ఆధునిక ఫీచర్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 12.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, పనోరమిక్ సన్ రూఫ్, పవర్డ్ టెయిల్ గేట్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం లభిస్తుంది.
ఇదే ప్లాట్ఫామ్ ఆధారంగా MG మరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ (PHEV) SUVను కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే తీసుకురావాలని భావిస్తోంది. ఈ మోడల్ మహీంద్రా XUV 7XOతో పోటీ పడే అవకాశం ఉంది. డిజైన్ పరంగా ఎలక్ట్రిక్ మోడల్ను పోలి ఉన్నప్పటికీ, కొన్ని స్టైలింగ్ మార్పులు కనిపించే అవకాశముంది. ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUVలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, 20.5 kWh బ్యాటరీ ప్యాక్ను అందించనున్నారు. ఈ పవర్ ట్రెయిన్ కలిపి 194 bhp శక్తి, 230 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీతో మాత్రమే సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. పెట్రోల్ ట్యాంక్ ను కలిపి మొత్తం రేంజ్ దాదాపు 1,100 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
కొత్త ఎలక్ట్రిక్ SUVతో పాటు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మోడల్ను కూడా తీసుకురావడం ద్వారా భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయాలని MG లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాల కోసం ఎక్కువ రేంజ్, ప్రీమియం ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీతో ఈ రెండు కొత్త SUVలు అందుబాటులోకి రానున్నాయి.
Read Also: సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!