Nissan Gravite Price Hike Announced: భారత మార్కెట్లో ఇటీవల విడుదలైన నిస్సాన్ గ్రావైట్ MPV ధరలు పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 5.65 లక్షల ప్రారంభ ధరతో ఈ వాహనాన్ని కంపెనీ పరిచయం చేసింది. అప్పట్లో ప్రకటించిన ప్రత్యేక ప్రారంభ ధరల గడువు పూర్తి కావడంతో ఇప్పుడు పలు వేరియంట్లపై ధరలను సవరించింది.
కంపెనీ ప్రకటించిన తాజా ధరల ప్రకారం, గ్రావైట్ మోడల్ పై గరిష్టంగా రూ. 18,400 వరకు పెంపు అమలులోకి వచ్చింది. ముఖ్యంగా N-Connecta పెట్రోల్ మాన్యువల్, N-Connecta CNG మాన్యువల్ వేరియంట్ల ధరలు ఎక్కువగా పెరిగాయి. అలాగే Tekna CNG MT, Tekna LE CNG MT, Tekna Petrol MT, Tekna LE Petrol MT వేరియంట్ల ధరలు కూడా పెరిగాయి. ఈ వేరియంట్లపై సుమారు రూ. 17,000 పెంచినట్లు ప్రకటించింది. మరోవైపు N-Connecta Petrol AMT, Tekna Petrol AMT, Tekna LE Petrol AMT వేరియంట్ల ధరలు పెరిగాయి. గ్రావైట్ Acenta Petrol MT, Acenta CNG MT వేరియంట్ల ధరలు రూ. 9,400 వరకు పెరిగాయి. అదే సమయంలో Visia Petrol MT, Visia CNG MT వేరియంట్లపై రూ. 8,400 మేర ధరలు పెరిగాయి.
ధరల సవరణ తర్వాత నిస్సాన్ గ్రావైట్ ప్రస్తుతం రూ. 5.73 లక్షల నుంచి రూ. 8.52 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ ధరల్లో అందుబాటులో ఉంది. ఈ MPV, రెనాల్ట్ ట్రైబర్ తో ఒకే ప్లాట్ ఫారమ్ ను పంచుకుంటుంది. తక్కువ ధరలో 7 సీటర్ వెహికల్ కోరుకునే కుటుంబాల కోసం ఇదో బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
మరోవైపు నిస్సాన్ భారత మార్కెట్లో మరింత సత్తా చాటేందుకు కొత్త మోడళ్లను కూడా సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది చివర్లో ‘టెకాన్’ పేరుతో కొత్త మిడ్ సైజ్ SUVను విడుదల చేసే అవకాశముంది. ఈ SUV టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి రాబోయే మోడళ్లు, రెనాల్ట్ డస్టర్ లాంటి పాపులర్ మోడల్స్ కు గట్టి పోటీ ఇవ్వనుంది.
అంతేకాకుండా, టెకాన్ తర్వాత మూడు వరుసల సీట్లతో కూడిన కొత్త SUVను కూడా నిస్సాన్ భారత మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. దీంతో కంపెనీ MPV, SUV విభాగాల్లో తన మోడల్స్ శ్రేణిని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. గ్రావైట్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ఇకపై ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో నిస్సాన్ నుంచి రాబోయే కొత్త SUVలు భారత మార్కెట్లో కంపెనీకి కొత్త అవకాశాలను తీసుకురానున్నాయి.
Read Also: హోండా To BMW.. జూన్ లో మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న 7 కొత్త కార్లు ఇవే!