Delhi: ఇండియా కూటమి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ, భారత విదేశాంగ విధానం దెబ్బతిందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల కోట్లాది మంది ఓటు హక్కును కోల్పోతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలహీన వర్గాలపై అఘాయిత్యాలు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయని ఆరోపించారు.
ఢిల్లీలో ‘ఇండియా కూటమి’ భేటీ
ఢిల్లీ వేదికగా కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇండియా కూటమి సమావేశం అయ్యింది. ఈ భేటీకి కూటమిలోని పార్టీలన్నీ హాజరయ్యారు. ప్రారంభోపన్యాసం చేశారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. ఇండియా కూటమి మూడేళ్ల కిందట ఏర్పడిందన్నారు. ఏప్రిల్ 17న మనమంతా ఒక తాటి మీదకు వచ్చామని, డీలిమిటేషన్పై మోడీ ప్రభుత్వ తీసుకొచ్చిన బిల్లులను ఓడించామన్నారు. ఈ విషయంలో మన సంఘీభావం, ఐక్యతను ప్రదర్శించామన్నారు.
ఇప్పుడు ఆ భావనను మరింత బలపరచాలన్నారు. మోదీ ప్రభుత్వం పాలన కారణంగా దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు ఇండియా కూటమిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని నొక్కి వక్కానించారు. తద్వారా రాజకీయ, ఆర్థిక, సామాజిక విదేశాంగ విధానాలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవచ్చన్నవారు.
విదేశాంగ విధానం, సర్ అంశాలపై కాంగ్రెస్ ఛీప్ ఖర్గే కీలక వ్యాఖ్యలు
ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ- SIR వల్ల కోట్లాది మంది ప్రజలు తమ ఓటు హక్కు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కును హరించి వేస్తున్నారని దుయ్యబట్టారు. అంతేకాదు రాజ్యాంగంపై నిరంతరం దాడి జరుగుతోందని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, భయపెట్టడానికి దర్యాప్తు సంస్థలను సాధనాలుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.
ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలపై వివక్ష చూపుతున్నారని వెల్లడించారు. దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత ప్రతికూలంగా ఉందన్నారు. కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి కొత్త పెట్టుబడులు రాలేదని తేల్చేశారు. అనేక రంగాలలో ప్రైవేట్ గుత్తాధిపత్యం పెరుగుతోందని మనసులోని మాట బయటపెట్టారు. ఎంఎస్ఎంఈల భవిష్యత్తు తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు.
ALSO READ: టీఎంసీలో తగ్గని సంక్షోభం.. ఈసారి రాజ్యసభ సభ్యుల వంతు, ఒకొక్కరుగా రాజీనామాలు
పరీక్ష విధానంలో నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది యువత నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలహీన వర్గాలపై అఘాయిత్యాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. భారత విదేశాంగ విధానం రాజీ పడుతోందని, ఎప్పటినుంచో బలంగా సమర్థిస్తున్న సాంప్రదాయ విలువలను పాటించలేదన్నారు.