India Says No to Robotaxis: డ్రైవర్ లేకుండా నడిచే కార్లు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అవుతున్నాయి. అమెరికా, చైనా లాంటి దేశాల్లో ఇప్పటికే రోబోటాక్సీలు రోడ్లపై ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. అయితే, భారత్ లో మాత్రం ఈ టెక్నాలజీ విషయంలో ఇప్పటికీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఉద్యోగాలపై ప్రభావం పడుతుందనే కారణంతో డ్రైవర్ లెస్ కార్లను అనుమతించబోమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ప్రస్తుతం డ్రైవర్ల ఉపాధిని కాపాడే అవకాశం ఉంటుంది. కానీ, భవిష్యత్తులో ఆటోమేటిక్ వాహనాల రంగంలో భారత్ వెనుకబడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే డ్రైవర్ లెస్ కార్లు అనేవి కేవలం వాహనాలు మాత్రమే కాదు. వాటి వెనుక సాఫ్ట్ వేర్, సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ప్రాసెసింగ్ లాంటి అనేక ఆధునిక సాంకేతికతలు ఉంటాయి.
ప్రస్తుతం అమెరికాలో Waymo, చైనాలో Baidu Apollo Go లాంటి సంస్థలు ఈ రంగంలో ముందంజలో ఉన్నాయి. ఇవి కేవలం కార్లను తయారు చేయడం మాత్రమే కాదు, వాటిని ఆటోమేటిక్ గా నడిచేలా చేసే పూర్తి సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ రంగం భవిష్యత్తులో భారీ ఆర్థిక అవకాశాలను సృష్టించే అవకాశం ఉంది. భారత్ ఇప్పటికే ఆటోమొబైల్ విడిభాగాలు, సాఫ్ట్ వేర్ సేవలు, ఇంజినీరింగ్ రంగాల్లో బలంగా ముందుకు వెళ్తోంది. అయినప్పటికీ డ్రైవర్ లెస్ వెహికల్స్ ఎకోసిస్టమ్ లో పెద్దగా భాగస్వామ్యం కాలేకపోయింది. ఇదే కొనసాగితే ప్రపంచ మార్కెట్లో భారత్ కు లభించే అవకాశాలు తగ్గిపోవచ్చు.
కొన్ని భారతీయ సంస్థలు ఇప్పటికే డ్రైవర్ లెస్ కార్ల తయారీ దిశగా అడుగులు వేస్తున్నాయి. విప్రో, ఐఐఎస్సీ, ఆర్వీ కాలేజ్ లాంటి సంస్థలు భారతీయ రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా పని చేసే ఆటోనమస్ వాహనాలపై పరిశోధనలు చేస్తున్నాయి. ఫ్లక్స్ ఆటో, ఫ్లో మొబిలిటీ, మైనస్ జీరో, స్వాయత్ రోబోట్స్ లాంటి స్టార్టప్లు కూడా ఈ రంగంలో ప్రయోగాలు కొనసాగిస్తున్నాయి.
వాస్తవానికి భారతీయ ట్రాఫిక్ పరిస్థితులు ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైనవిగా నిపుణులు భావిస్తారు. ఇక్కడ సమర్థవంతంగా పని చేసే డ్రైవర్ లెస్ సిస్టమ్ ను అభివృద్ధి చేయగలిగితే, అది ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా విజయవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అందుకే భారత్ ఈ రంగంలో పరిశోధన, అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్ వెంటనే డ్రైవర్ లెస్ కార్లను రోడ్లపైకి తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ, పరిశోధన, టెస్టింగ్, ప్రోటోటైప్ డెవలపింగ్ లాంటి కార్యక్రమాలను ప్రోత్సహించవచ్చు. గనులు, పరిశ్రమలు, విమానాశ్రయాలు, ఐటీ పార్కులు లాంటి ప్రాంతాల్లో ఈ వాహనాల పరీక్షలకు అనుమతి ఇవ్వవచ్చు.
ఇండియాలో, డ్రైవర్ లెస్ కార్లపై పూర్తి నిషేధం కంటే కొంతమేర అనుమతులు ఇవ్వడం మంచిది. ఉద్యోగాలను కాపాడుతూ, కొత్త సాంకేతికతల అభివృద్ధికి అవకాశం కల్పిస్తేనే భారత్ భవిష్యత్తులో ఈ రంగంలో పోటీగా నిలబడగలదు. లేదంటే, ప్రపంచం ముందుకు వెళ్తుండగా, భారత్ కేవలం ఈ సాంకేతికతను దిగుమతి చేసుకునే దేశంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
Read Also: ఇక నో రీసేల్ టెన్షన్.. బై బ్యాక్ గ్యారెంటీతో లభిస్తున్న 8 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!