తెలంగాణ రాష్ట్ర బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 38 జిల్లాల అధ్యక్షులకు గానూ.. 28 జిల్లాల అధ్యక్షులను ఆ పార్టీ కేంద్రనాయకత్వం ప్రకటించింది. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా… తెలంగాణ బీజేపీకి నూతన సారథి ఎవరనే చర్చ సాగుతోంది. ఆ నియామకంపై కేంద్రనాయకత్వం ఆచితూచి వ్యవహరించటంతో.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధ్యక్షపదవిపై.. ఎవరి ప్లానింగ్స్, ఎవరి ఈక్వేషన్స్ వారికి ఉన్నాయట.
కొత్త నేతలకు ఇవ్వొద్దంటున్న పాత నేతలు
అధ్యక్ష పదవి కొత్త నేతలకు ఇస్తే సహించేది లేదని.. పాత నేతలతో పాటు సంఘ్ పరివారులు తేల్చేయటంతో.. అధ్యక్ష పదవి కచ్చితంగా RSS బ్యాగ్రౌండ్ ఉన్న నేతలకే వస్తుందనే ప్రచారం బలంగా వినిపిస్తోందట. అలాంటి వార్తలతో సంబంధం లేనట్లుగా కొందరు నేతలు మాత్రం.. అధ్యక్ష పీఠం కోసం పావులు కదుపుతూనే ఉన్నారు. మరికొందరైతే.. తమదే పదవంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారట.
మరింత ముదురుతోన్న అధ్యక్షపీఠం పంచాయితీ
మరోవైపు రాష్ట్ర బీజేపీలో అధ్యక్షపీఠం పంచాయితీ.. మరింత ముదురుతోందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వ్యవహారం కాస్తా..రాష్ట్ర కార్యాలయం దాటి హస్తినకు చేరిందట. దీనిపై కేంద్ర నాయకత్వం కుస్తీ పడుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అధ్యక్ష రేసులో.. మొన్నటి వరకూ కొత్త, పాత నేతల పేర్లు వినిపించాయి. తాజాగా వార్ వన్ సైడ్ అన్నట్టుగా కొత్త నేతల వైపుకే మొగ్గు చూపుతోందంటూ టాక్ నడుస్తోంది.
పైరవీలతో బిజీబిజీగా మారిపోయిన నేతలు
అధ్యక్ష పదవికి మేం అర్హులం కాదా అన్నట్లు కొందరు నేతలు ప్రవర్తన ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎవరికి వారే.. పైరవీలు చేసుకుంటూ.. బిజీబిజీగా మారిపోయారట. అధ్యక్ష పదవిపై కొత్త, పాత నేతల మధ్య జరుగుతున్న పోరుతో.. కేంద్ర అధినాయకత్వం కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. పదవి మాటెలా ఉన్నా పార్టీలో నేతల మధ్య వార్.. పీక్ స్టేజ్కు చేరుకుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో.. అధిష్టానం డైలమాలో పడినట్లు తెలుస్తోంది.
నూతన అధ్యక్షుడి కోసం ఎదురుచూస్తున్న కిషన్ రెడ్డి
కొత్త, పాత నేతల పంచాయితీ ఒకవైపు అయితే..రాష్ట్ర అధ్యక్ష పదవి ఎప్పుడెప్పుడా అని ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎదురూచూస్తున్నారట. ప్రస్తుతానికి రెండు పదవులకూ న్యాయం చేయలేక… రెండు పడవల ప్రయాణం చేయలేకపోతున్నానని.. ఆయన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది. తొందరగా కొత్త సారధిని నియమిస్తే.. తనపై రాష్ట్ర పార్టీ బాధ్యతలను తగ్గుతాయని.. అప్పుడు.. కేంద్రమంత్రి పదవికి న్యాయం చేయొచ్చనే యోచనలో కిషన్ రెడ్డి ఉన్నట్టుగా వార్తలు గుప్పుమంటున్నాయి.
కిషన్కు తలనొప్పిగా మారిన సంస్థాగత ఎన్నికలు
అంతేకాదు పార్టీలో సంస్థాగతంగా జరుగుతున్న పంచాయితీలు కూడా కిషన్ రెడ్డికి తలనొప్పిగా మారాయట. రోజుకొక గొడవ, పూటకొక పంచాయితీతో.. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి.. ఏం చేయాలో తెలియక ఇబ్బందిపడుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. తనను ఎంత తొందరగా రిలీవ్ చేస్తే. అంత మంచిదనే అభిప్రాయంలో కిషన్ ఉన్నట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.
ఉన్న పలంగా బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగింపు
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు.. తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిణామాలతో బండి సంజయ్ను ఉన్న ఫలంగా అధ్యక్ష పదవి నుంచి తప్పించిన హైకమాండ్.. ఆ బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించింది. అయితే అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ సహా పలువురి పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈటల రాజేందర్ కొత్త నేత కాబట్టి.. ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే, సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్న పాత నేతలు అసంతృప్తికి గురవుతారన్న యోచనతో.. నాడు కిషన్రెడ్డికి అప్పగించారనే టాక్ వినిపించింది.
బీజేపీ కొత్త సారథి ఎవరనే అంశంపై ఉత్కంఠ
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో కిషన్ రెడ్డితో పాటు, బండి సంజయ్ ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఐతే కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి నుంచి రిలీవ్ అవ్వాలని, కేంద్రమంత్రిగా మాత్రమే కొనసాగాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే బీజేపీలో ఒకరికే.. జోడు పదవుల సంప్రదాయం లేదు కాబట్టి.. కిషన్రెడ్డి నుంచి ఆ పదవి వేరొకరికి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
ఇంతకీ.. కొత్త బాస్ పేరు ఎప్పుడు బయటకు వస్తుంది
మొత్తానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి.. అనేక పంచాయితీలతో ముడి ఉండగా.. కొత్త సారథి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కిషన్ రెడ్డి మాత్రం అధ్యక్ష పదవి నుంచి ఎప్పుడు దిగిపోదామా అన్నట్టుగా ఉన్న నేపథ్యంలో.. అధిష్టానం ఆ ఛాన్స్ ఎవరికి ఇస్తుందనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతకీ.. కొత్త బాస్ పేరు ఎప్పుడు బయటకు వస్తుంది. ఎప్పుడు సంస్థాగత ఎన్నికలకు ఫుల్స్టాప్ పెడుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.