BJP: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే నాయినేషన్ల ప్రక్రియ మొదలై.. పోలింగ్కు రెండు వారాలు కూడా గడువు లేకపోవడంతో అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తు ముమ్మరం చేశాయి. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ భారీ ప్రచార వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఐదు భారీ బహిరంగ సభలు, ప్రచారానికి జాతీయ అగ్రనేతల రాకతో, మున్సిపల్ పోరును హై వోల్టేజ్గా మార్చేందుకు కమలం పార్టీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోందంట
మున్సిపల్ సమరానికి కమలం పార్టీ మాస్టర్ ప్లాన్
మున్సిపల్ సమరానికి కమలం పార్టీ మాస్టర్ ప్లాన్ కు స్కెచ్ వస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. త్వరలో జరిగే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమరంలో సత్తా చాటుకోవడానికి అన్ని మార్గాలు ఉపయోగించుకోవాలని చూస్తోందంట. ఐదు భారీ బహిరంగ సభలతో, రంగంలోకి జాతీయ అగ్రనేతలను దింపడానికి రాష్ట్ర కాషాయపార్టీ నేతలు స్కెచ్ గీస్తున్నారంట. ఈ ఎన్నికలను భవిష్యత్ రాజకీయాలకు పునాది గా మార్చుకునే వ్యూహంతో కాషాయ దండు ముందుకెళ్లాలని చూస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు సవాల్ విసురుతూ, మున్సిపల్ పీఠాలే లక్ష్యంగా కమలం పార్టీ ఇప్పుడు పూర్తి స్థాయి ప్రచార యుద్ధానికి సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందంట.
అత్యధిక మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునే లక్ష్యంతో, ఎన్నికల ప్రచారానికి ఊపు తీసుకురావాలనే ప్లాన్ చేస్తోందంటున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు భారీ బహిరంగ సభలను నిర్వహించడానికి కార్యచరణ రూపొందించిదంట. ఈ సభల్లో ఆ పార్టీ జాతీయ అగ్రనేతలు పాల్గొనేలా ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు కాషాయశ్రేణుల చెప్తున్నాయి. జాతీయ నేతల రాకతో మున్సిపల్ ఎన్నికల ప్రచార హీట్ ను మాస్ లెవల్కు తీసుకెళ్లేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది.
కరీంనగర్, నిజామాబాద్ సభలకు నితిన్ నబీన్ సిన్హా..
ఉత్తర తెలంగాణలో కీలకంగా మారిన కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో జరిగే భారీ సభలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా హాజరుకానున్నట్లు సమాచారం. ఇక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో జరిగే సభకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వస్తారని, ఉమ్మడి నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో నిర్వహించే సభలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
బీజేపీ ప్రధానంగా ఉత్తర తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు మాత్రమే గెలిచారు. వారిలో అత్యధికంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే విజయం సాధించారు. గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో బీజేపీకి అంతోఇంతో అనుకూల ఫలితాలు రావడంతో, ఆ ప్రాంతంపై పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించిందంట. అందుకే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలను రాజకీయంగా కీలకంగా భావిస్తూ అక్కడ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఎన్నికల పరిశీలకులగా ఇతర రాష్ట్రాల నేతలు
మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు చెందిన సమన్వయ కర్తలను నియమించింది. మహారాష్ట్ర మంత్రి ఆశిష్ శెలార్ను మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జీగా నియమించగా… రేఖా శర్మ, అశోక్లను కో- ఇన్చార్జీలుగా నియమించింది. అదే సమయంలో రాష్ట్ర నాయకత్వం జిల్లా, మున్సిపాలిటీ స్థాయిల్లో ఇన్చార్జులను నియమించి పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో రంగంలోకి దింపడానికి సన్నాహాలు చేస్తోంది.
నితిన్ నబీన్ సిన్హాతో భేటీ అయిన రాంచంద్రారావు
నూతనంగా ఎన్నికైన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హాతో భేటీ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రతి స్థాయిలో పార్టీ శ్రేణులు యాక్టివ్గా పని చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా జనసమీకరణ, బూత్ స్థాయి నిర్వహణపై ఫోకస్ చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ సమరం, భవిష్యత్కు సెమీ ఫైనల్…? అని స్పష్టం చేశారంట.
Also Read: బీజేపీ కి బిగ్ షాక్..కాంగ్రెస్ కు సపోర్ట్ గా బీజేపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
బీజేపీ వచ్చే నెల 11న జరగునున్న మున్సిపల్ ఎన్నికలనుకేవలం స్థానిక సంస్థల పోరాటంలానే కాకుండా.. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్గా భావిస్తోందంట. అందుకే అగ్రనేతల పర్యటనలు, భారీ సభలతో ప్రజల్లో రాజకీయ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కమలం పార్టీ వ్యూహ రచన చేస్తోందంట. మరి ఈ మాస్టర్ ప్లాన్ కమలం పార్టీకి మున్సిపల్ విజయాన్ని తెచ్చిపెడుతుందా..? లేదా సమీకరణలను తలకిందులు చేసి ఆ పార్టీకి ఎప్పటిలాగే నిరాశ మిగులుస్తుందో చూడాలి.
Story By Apparao, Bigtv