Talliki Vandanam: రాష్ట్రవ్యాప్తంగా విధి నిర్వహణలో మునిగి తేలే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ప్రభుత్వం ఎట్టకేలకు ఒక తియ్యటి కబురు అందించింది. వారు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక పెద్ద డిమాండ్కు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంగన్వాడీ సిబ్బందికి కూడా ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అంగన్వాడీలకు లబ్ధి చేకూరుస్తూ మంత్రి ప్రకటన
రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. అన్ని రకాల అంగన్వాడీ టీచర్లు, ఆయాల పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. గతంలోనే అంగన్వాడీ సిబ్బంది జీతాల పెంపు, గ్రాట్యుటీ అమలు వంటి సంక్షేమ నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఈ నిర్ణయంతో వారి కుటుంబాల్లో మరింత భరోసా నింపిందని మంత్రి పేర్కొన్నారు.
విపక్షాల విమర్శలు
ప్రభుత్వం ఈ ప్రకటన చేసినప్పటికీ, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ పథకం అమలు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ‘తల్లికి వందనం’ కాదు, ‘తల్లికి వంచనం’ అంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ఆంక్షల పేరుతో ఎంతోమంది అర్హులను పథకం నుంచి తప్పించారని ఆయన ఆరోపించారు.
జూలై 22 నుంచి నిధుల జమ
మరోవైపు ప్రభుత్వం ఈ పథకం అమలుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. జూలై 22 నుంచి 24 మధ్య అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో రూ. 13 వేలు చొప్పున ‘తల్లికి వందనం’ నిధులను నేరుగా జమ చేయనుంది. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. విమర్శలు ఎలా ఉన్నా, అంగన్వాడీ కుటుంబాలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పాలి.
Also Read: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!