సీఎం ఇలాఖాపై కవిత నజర్ పెట్టారు. ఆదివారం నాడు సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆమె పార్టీ పెట్టిన దగ్గర నుంచి పాలమూరులో సభలు నిర్వహించడం ఇది రెండోసారి.
తొలిసారిగా షాద్నగర్ సమీపంలోని చౌదరిగూడెంలో సభను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా సీఎం సొంత నియోజకవర్గంలోనే భారీ పబ్లిక్ మీటింగు ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. కేవలం కాంగ్రెస్, సీఎం రేవంత్ను టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఈ సభ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.
దాదాపు పది వేల మందితో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి ఒకరోజు ముందే.. అంటే శనివారం నాడే కేటీఆర్ హడావుడిగా పాలమూరు టూర్ పెట్టుకున్నారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించే ప్రోగ్రాం పెట్టుకున్న కేటీఆర్.. అనంతరం పెబ్బేరులో మీడియాతో మాట్లాడారు. వనపర్తిలో రోడ్ షో నిర్వహించి కాంగ్రెస్ సర్కార్ను తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఏడాదిన్నర ఓపిక పట్టండి.. మళ్లీ కేసీఆర్ వస్తారు.. అప్పటి వరకు మీ బాధలు తీరయి.. అంటూ అక్కడి రైతులనుద్దేశించి మాట్లాడారు. ఏరికోరి తెచ్చుకున్నారుగా మరి.. మా పాలమూరు బిడ్డా.. పులి బిడ్డా అని. ఆయన నల్లమల పులి కాదు.. చంద్రబాబు వద్ద పిల్లి.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కృష్ణా నీళ్లలో మన వాటాను కూడా వాడుకోలేకపోతున్నారని, ఆంధ్ర పెద్దు ఎత్తున నీళ్లను తరలించుకుపోతుందని విమర్శించారు. సీఎం గురించే తన ప్రసంగాల్లో, మీడియా మీటింగుల్లో మాట్లాడిన కేటీఆర్.. సాగునీటికి చెందిన అంశంపైనే ఎక్కువగా సీఎంను విమర్శించేందుకే కేటీఆర్ సమయం కేటాయించారు. పెబ్బేరులో పార్టీ కార్యకర్తలతో మీటింగు పెట్టుకున్నారు.
చెల్లె కవిత భారీ బహిరంగకు ముందురోజే అన్న పాలమూరులో తిరగడం.. ఇద్దరూ సీఎంను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కవిత సీఎంను టార్గెట్ చేస్తే కేటీఆర్ .. చెల్లె సభకు ప్రయార్టీకి దక్కకుండా ఒకరోజు ముందు తన పర్యటన పెట్టుకుని .. అక్కడి రాజకీయాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారనే అభిప్రాయలు కూడా వ్యక్తమయ్యాయి.
అయితే ఆదివారం కవిత సభపై భారీ హైప్ను క్రియేట్ చేశారు తెలంగాణ రక్షణ సేన పార్టీ శ్రేణులు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఈ వేదికగా ప్రకటించున్నారనే హింట్ ఇవ్వడం మూలంగా ఇంకా ఆమే ఏమైనా కొత్త పథకాలను పార్టీ తరపున ప్రకటిస్తారా? అనే చర్చ కూడా మొదలైంది. ఇప్పటికే ఆమె భూ లక్ష్మి పథకాన్ని ప్రకటించి.. ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇస్తానని ప్రకటించడం తెలిసిందే.