Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: అణచివేత, దోపిడిని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో భరించదని, పెత్తందారీతనం, భూ స్వామ్య వ్యవస్థ లకు వ్యతిరేకంగా పనిచేయడం ఇక్కడి ప్రజల స్వభావం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అన్యాయాన్ని ఎదిరించడం తెలంగాణ ప్రజల లక్షణం అంటూ సీఎం వివరించారు. అందుకే రాచరిక పాలన కు 2023లో చెక్ పెట్టి ప్రజా పాలనకు అవకాశం కల్పించారని సీఎం గుర్తు చేసుకున్నారు. ఈ ప్రజా పాలనలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదని, నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దు కుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందామని అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చేరాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు ఈ చారిత్రక సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ‘అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం మా ప్రజా పాలనకు పునాదులు. సెప్టెంబర్ 17వ తేదీ మన బాధ్యతను కూడా గుర్తు చేసే రోజు. ఈ చారిత్రక నేపథ్యం, ఉద్యమాల ఫలాలు ప్రజల జీవితాల్లో కనిపించాలి. రైతుకు భరోసా ఉండాలి. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి. పేద బిడ్డకు మంచి చదువు, మంచి వైద్యం అందాలి. యువతకు ప్రపంచంతో పోటీ పడే అవకాశాలు రావాలి. తరతరాల అణిచివేత, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ విధానాలపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ. నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులకు పుట్టినిల్లు తెలంగాణ. అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం ఈ నేల ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యాన్ని రగిలించింది.1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం అధికారికంగా భారతదేశంలో అంతర్భాగమైంది. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భం. అందుకే సెప్టెంబర్ 17ను మనం ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ప్రపంచంతో పోటీ పడుతున్నాం..
ప్రజా పాలన అంటే ప్రజల మాటకు విలువ ఇవ్వడం… వారి సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. అంతేగాక ప్రభుత్వ వనరులు అందరికీ చేరేలా చూడాలన్నారు. అదే స్ఫూర్తితో ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ ప్రజా పాలన కొనసాగిస్తున్నామన్నారు. తెలంగాణ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడుతోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931కు చేరిందన్నారు. ఇది దేశ తలసరి ఆదాయం కన్నా దాదాపు 91 శాతం అధికమన్నారు. అభివృద్ధి అంకెల్లో మాత్రమే కాకుండా ప్రజల జీవితాల్లో కనిపించాలన్నదే తమ లక్ష్యం అన్నారు.
దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ
ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి అని, ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశామన్నారు. రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలను అప్పుల ఊబి నుంచి బయటపడేశామన్నారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. సన్నాలకు క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మద్దతుతో వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు.
రైతు సంక్షేమానికి రూ.1 లక్ష 72 వేల కోట్లు
32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1 లక్ష 72 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. భూ భారతి చట్టం ద్వారా భూ పరిపాలనలో సమగ్ర సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. భూధార్, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలు ప్రారంభించామని, 5 లక్షల 94 వేల మంది రైతులకు పట్టాదార్ పాస్బుక్లు జారీ చేశామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతలు, ఎస్ఎల్బీసీతో పాటు ఇతర పెండింగ్ ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని సీఎం చెప్పారు.
కోటి మహిళలను కోటీశ్వరులను చేస్తాం..
2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ సగర్వంగా జీవించాలని, ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాల్సిన అవసరం ఉన్నదన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. ఈ ప్రయాణాలతో మన ఆడబిడ్డలకు రూ.12,385 కోట్ల మేర ఖర్చు ఆదా అయిందన్నారు. గృహజ్యోతి కింద 53 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. 43 లక్షల కుటుంబాలకు రూ. 500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు.
మరో 2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1 లక్ష 68 వేల మంది ఆడబిడ్డలకు రూ. 4,709 కోట్ల సహాయం చేశామన్నారు. 4.54 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.60 వేల 487 కోట్ల బ్యాంకు లింకేజీ, రూ. 1,900 కోట్ల వడ్డీ రాయితీ కల్పించామన్నారు. మహిళా మార్ట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులతో మహిళల ఆదాయం పెంచుతున్నామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 3.42 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. 15 లక్షలకు పైగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. 43 లక్షలకు పైగా మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల కింద సుమారు రూ. 31 వేల కోట్లు అందించామన్నారు. తాజాగా మరో 2.25 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందన్నారు.
బీసీ రిజర్వేషన్లకు ప్రయత్నం..
ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో నివసించాలనేది తమ ప్రభుత్వ ఆశయం అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల తొలి దశలో రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షలు అందించామన్నారు. రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. సామాజిక అంతరాలను తగ్గించి ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేను శాస్త్రీయంగా చేపట్టామన్నారు. ఆ సర్వే గణాంకాల ఆధారంగా విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించామన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ చేపట్టామన్నారు. ఫిబ్రవరి 4ను ప్రతి ఏటా “తెలంగాణ సోషల్ జస్టిస్ డే” గా జరుపుకుంటున్నామన్నారు. సామాజిక న్యాయం అంటే తమకు నినాదం కాదని,వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే అంటూ సీఎం వివరించారు.
విద్య, వైద్యం రెండు కళ్లు లాంటివి..
ప్రజా ప్రభుత్వానికి విద్య, వైద్యం రెండు కళ్లలాంటివన్నారు. కుల, మత భేదాలు లేకుండా పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో సకల వసతులతో వీటి నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందించేందుకు రూ. 927 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనాన్ని 12వ తరగతి విద్యార్థుల వరకు విస్తరించామన్నారు. 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు.
కార్పొరేట్ స్థాయి వైద్యం..
విద్యా రంగంలో తీసుకున్న చర్యలతో పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుందన్నారు.ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల ఆఫ్షోర్ క్యాంపస్లను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అమెరికాకు చెందిన నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీతో పాటు బ్రిటన్లోని 17 స్వతంత్ర విద్యా సంస్థల సమాఖ్య యూనివర్సిటీ ఆఫ్ లండన్ తమ ఆఫ్షోర్ క్యాంపస్ల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశాయని సీఎం తెలిపారు. ఇకఆరోగ్య రంగానికీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 5 లక్షల 19 వేల మందికి రూ.2,526 కోట్ల సహాయం అందించామన్నారు. సామాన్యుడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో గోషామహల్లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం మొదలైందన్నారు.
సనత్నగర్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్..
సనత్నగర్లో మర్రి చెన్నారెడ్డి టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించుకున్నామన్నారు. అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వరంగల్లో 2 వేల పడకలతో టిమ్స్ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.తెలంగాణ ఉద్యమంలో యువత ముందుండి పోరాడిందన్నారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం పోరాడిందన్నారు. 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా పూర్తి చేశామన్నారు. గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు పరీక్షలను పారదర్శకంగా నిర్వహించామన్నారు.
ఏఐతో స్వరూపం మారుతుంది..
ఏఐతో ఉద్యోగాల స్వరూపం మారుతోందన్నారు. కొత్త నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. అందుకే నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసుకున్నామన్నారు. ఏటీసీలో శిక్షణ పొందిన విద్యార్థులు ఈరోజు క్యాంపస్ ప్లేస్మెంట్స్ సాధిస్తున్నారన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. మన యువత ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను కూడా వేగంగా విస్తరిస్తున్నామన్నారు. రూ. 38,595 కోట్లతో 122.9 కిలోమీటర్ల మెట్రో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు పంపించామన్నారు.
Also Read: యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య.. ఆమె హత్యకు ప్రతీకారం?
మూజీ పునరుజ్జీవన ప్రాజెక్టు..
ఆదిలాబాద్, మామునూరు విమానాశ్రయాలకు అనుమతులు సాధించామన్నారు. అవసరమైన భూసేకరణ చేపట్టామన్నారు. హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలనే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రారంభించామన్నారు. 55 కిలోమీటర్ల పరిధిలో మూసీని పునరుజ్జీవింపజేస్తామన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఆహార కల్తీని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని,అందుకే టీజీ సేఫ్ ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. యువత పెడదోవ పట్టకుండా రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు ఈగల్ వ్యవస్థను పటిష్ఠం చేశామన్నారు.
సీఎం రేవంత్ లక్ష్యం..
తమ లక్ష్యం ప్రస్తుత అవసరాలు తీర్చుతూనే, రేపటి తెలంగాణను నిర్మించడం అని సీఎం వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సాధించేందుకు ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేది తమ సంకల్పం అన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. దాదాపు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీ నిర్మిస్తున్నామన్నారు. డిసెంబర్లో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సందర్భంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ను ఆవిష్కరిస్తామన్నారు. ఫ్యూచర్ సిటీలో టీసీఎస్ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ నిర్మించేందుకు ముందుకు వచ్చిందన్నారు. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఇప్పటికే డేటా సెంటర్ నిర్మాణం చేపట్టిందన్నారు.
ప్రత్యేక జోన్లతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి..
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, ఈవీ పార్క్, ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి ప్రత్యేక జోన్లతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, గ్రీన్ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టులు, హైదరాబాద్–నాగపూర్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ పారిశ్రామిక కారిడార్లు తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చనున్నాయన్నారు. ఇక రహదారులు అభివృద్ధికి సూచిక. గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లాకు, జిల్లా నుంచి రాష్ట్ర రాజధానికి మెరుగైన రహదారి అనుసంధానం కల్పించేందుకు పనులు చేపట్టామని, ఆర్ అండ్ బీ పరిధిలో రూ.13 వేల కోట్లతో, పంచాయతీరాజ్ పరిధిలో రూ. 6,294 కోట్లతో రహదారి పనులు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, విద్యుత్ డిమాండ్ కూడా పెరిగిందన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తున్నామన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజల నుంచి కూడా సహకారం ఆశిస్తున్నామన్నారు. వీబీ జీ రామ్ జీలో ఎక్కువ పని దినాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Also Read: కేసీఆర్ ఫామ్హౌస్ భూముల్లో సర్వే షురూ.. 385 ఎకరాల్లో అసైన్డ్ భూమి ఎంత?