ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం అన్నట్టుగానే సాగుతోంది జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యవహారం. ప్రభుత్వం వీటి ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్న సమయంలోనే ఏదో ఒక రూపంలో ఆటంకం వచ్చి పడుతోంది. ఓటర్ల సమగ్ర సవరణ.. సర్తో దీనికి బ్రేక్ పడింది. ఇప్పుడు తాజాగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక తప్పేలా లేదని డిసైడ్ అయినపోయింది సర్కార్. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. దీని కోసం ఆత్రుతుగా చూస్తున్న బీఆర్ఎస్.. అధికార పార్టీకి గట్టిపోటీనివ్వనుంది.
పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టుగా ఖైరతాబాద్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడితే.. ఈ ఫలితాలే ఆ సర్కార్ పాలన తీరుకు రెఫరండం అని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు రెడీగా ఉంది. ఓడినా పెద్దగా నష్టపోయేదేమీ లేదు. ఇప్పుడు సర్కార్కే వచ్చి పడింది పెద్ద చిక్కు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం రేవంత్ వ్యూహం ఫలించింది. భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది. కానీ ఖైరతాబాద్లో పరిస్థితులు వేరు. క్యాండిడేట్ మీద ఉన్న నెగెటివిటీ, సర్కార్పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత.. మూడేండ్ల పాలనపై బీఆర్ఎస్ చేస్తున్న విస్తృత ప్రచారం .. ఇవన్నీ కాంగ్రెస్ గెలుపుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.
ఈ క్రమంలో దీన్ని చాలెంజింగ్గా తీసుకోనుంది రేవంత్ సర్కార్. ఉప ఎన్నికకు రెడీ కావాలని ఇప్పటికే క్యాడర్కు, క్యాండిడేట్కు సిగ్నల్స్ ఇచ్చేశారు సీఎం రేవంత్. ఇక బీఆర్ఎస్ కూడా ఇక్కడ గెలుపుతో.. ఇక రానున్న సర్కార్ తమదే అనే ధీమాను ప్రోది చేసుకుని, జనాల్లోకి మరింత విస్తృతంగా పోవాలని చూస్తున్నది. రానున్న జీహెచ్ఎంసీకి కూడా ఇది ట్రయలర్గా పనిచేయనుంది. దీంతో బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికపై సీరియస్ నజర్ పెట్టనుంది. బీజేపీ చీల్చే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీఆర్ఎస్కే నష్టం చేయనున్నాయి.
ఈ కారణాల వల్ల ఇక్కడ భారీ మెజారిటీ కష్టమేనంటున్నారు. ఆరు నెలల వ్యవధిలోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి.. దీని తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోవాల్సి వస్తోంది. ఆలోపు మరింత బలం పుంజుకోవాలని అధికార పార్టీ ఆలోచిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పునర్విభజన ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రభుత్వం దీనిని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీ (GHMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) లుగా విభజించింది సర్కార్.
మొత్తం పరిధిని 60 సర్కిళ్లుగా మార్చారు. కొత్త జీహెచ్ఎంసీ పరిధిలోకి 6 జోన్లు, 30 సర్కిళ్లు రాగా, సైబరాబాద్కు 16 సర్కిళ్లు, మల్కాజ్గిరికి 14 సర్కిళ్లను కేటాయించారు.వార్డుల పునర్విభజన (డెలిమిటేషన్)లో భాగంగా చుట్టుపక్కల ఉన్న 27 మున్సిపాలిటీలను విలీనం చేసిన తర్వాత మొత్తం వార్డుల సంఖ్యను 150 నుండి 300కు పెంచుతూ తుది నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
1955 నాటి పాత జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో, లండన్ తరహా పాలన కోసం తెలంగాణ అసెంబ్లీ ప్రతిష్టాత్మకమైన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (CURE) బిల్లును కూడా ఇటీవల ఆమోదించింది. వచ్చే నెల 31 నాటికి ఓటర్ల ధృవీకరణ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. అన్నీ అనుకున్న సమయానికి జరిగితే ఈ ఏడాది చివరకల్లా.. అంటే డిసెంబర్లోగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోదామని సర్కార్ భావించింది.
కానీ ఖైరతాబాద్ ఉప ఎన్నిక నేపథ్యం.. ఆ తదుపరి ఫలితాల ఆధారంగానే ఇప్పుడు ఈ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే మరో ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు అధికారులు.