KBR Park Project: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణ కారణంగా పెరుగుతున్న ట్రాఫిక్, రద్దీకి చెక్ పెట్టి, సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్ సిటీ ప్రాజెక్టుల కింద రూ. 1090 కోట్ల ప్రాజెక్టు వ్యయం, మరో రూ. 800 కోట్ల ఖర్చుతో స్థల సేకరణ చేసి నిర్మించాలనుకున్న ఏడు స్టీల్ ఫ్లై ఓవర్, మరో ఏడు అండర్ పాస్ ల ప్రతిపాదనలను సవరించాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. పది రోజుల క్రితం వరకు ఆహార్నిశలు ఎంతో వేగంగా జరిగిన పనులను ప్రస్తుతం అధికారులు నిలిపేశారు.
హెచ్ సిటీపై వెల్లువెత్తుతున్న విమర్శలు
ముఖ్యంగా ఈ పనులు చేపట్టేందుకు వీలుగా సరిగ్గా నెల రోజుల క్రితం గత నెల 18వ తేదీ నుంచి అమలు చేస్తున్న వన్ వే మంచి ఫలితాలనివ్వటంతో ఇక పార్కు చుట్టూ హెచ్ సిటీ పనులు ఎందకన్న ప్రస్తావన తెరపైకి రావటం, అనూహ్యాంగా పార్కు చుట్టూ వన్ వే మంచి ఫలితాలివ్వటంతో కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్ సిటీ పనులు అవసరమా? అన్న డైలమా అనంతరం ఈ ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్ ల నిర్మాణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని, ఇవే ప్రతిపాదనలో భారీగా సవరణలు చేయాలని ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వన్-వే సూపర్ హిట్..
ఈ మేరకు డీజీపీ సీసీ ఆనంద్ వద్ద రెండు రోజుల క్రితం జరిగిన ఓ ఉన్నతాధికారుల సమావేశంలో కూడా ఈ ప్రస్తావన రావటంతో పాటు పార్కు చుట్టూ వన్ వే మంచి ఫలితాలినిస్తుండటంతో పార్కు చుట్టూ భారీగా ఖర్చుతో ఏడు స్టీల్ ప్లై ఓవవర్లు, మరో అడు అండర్ పాస్ ల నిర్మాణం అవసరం లేదని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనల పునపరిశీలన, సవరణలకు సంబంధించి ఈ నెలాఖరు లోపు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. ముఖ్యంగా పార్కు చుట్టు ఉన్న ఏడు రద్దీ జంక్షన్లలో, స్టీల్ ఫ్లై ఓవర్లను నిర్మించే ప్రాంతాల్లో మొత్తం రూ.800 కోట్ల వ్యయంతో దాదాపు 453 ఆస్తుల నుంచి స్థలాలను సేకరించాల్సి ఉంది.
హెచ్ సిటీ ప్రతిపాదనల్లో భారీ మార్పులు
ఇందుకు జీహెచ్ఎంసీ స్థల యజమానులకు ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్ (టీడీఆర్)లు జారీ చేసి, స్థలాలను సేకరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావటంతో పాటు ప్రాజెక్టు వ్యయంలో ఎక్కువ శాతం కేవలం స్థల సేకరణకు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొనటం, టీడీఆర్ ల స్థానంలో నష్టపరిహారం చెల్లించేందుకు జీహెచ్ఎంసీ వద్ద నిధులు లేకపోవటం, అంతకు మించి పార్కు చుట్టూ అమలు చేస్తున్న వన్ వే ట్రాఫిక్ సమస్యకు చక్కటి పరిష్కారంగా మారి, మంచి ఫలితాలను ఇవ్వటంతో పార్కు చుట్టూ చేపట్టాల్సిన ప్రాజెక్టుల ప్రతిపాదనల ఉపసంహరణ, సవరణ వంటి పరిణామాలకు దారి తీసిందని చెప్పవచ్చు.
ప్రతిపాదనల్లో సవరణలు ఇలా..
ఇప్పటికే ప్రతిపాదించి, సర్కారు మంజూరు చేసిన ప్రతిపాదనల ప్రకారం పార్కు చుట్టూ ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు, రద్దీ జంక్షన్లలో ఏడు అండర్ పాస్ లను రూ. 1090 కోట్లతో నిర్మించాలని నిర్ణయించి, టెండర్ల ప్రక్రియ చేపట్టి నిర్మాణ సంస్థను కూడా ఎంపిక చేసినందున ఈ ప్రతిపాదలను మొత్తంగా రద్దు చేయకుండా సవరణలు చేసి, ఇప్పటికే ఎంపిక చేసిన నిర్మాణ సంస్థకు పనులు బాధ్యతను అప్పగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ (ఎన్ఎఫ్ సీఎల్ ) జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు ఫ్లై ఓవర్ ను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.
సరికొత్త రూపంలో KBR పార్క్ ఫ్లైఓవర్!
దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) నుంచి హకీంపేట కుంట మీదుగా శిల్పా లే అవుట్ వరకు మరో భారీ ఫ్లై ఓవర్ ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రతిపాదించిన సంగతి తెల్సిందే. కేబీఆర్ పార్కు కు కుడి వైపు నుంచి నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు ఫ్లై ఓవర్ నిర్మించటంతో పాటు ఎడమ వైపు ఐసీసీసీ నుంచి హాకీంపేట కుంట మీదుగా శిల్పా లే అవుట్ వరకు మరో ఫ్లై ఓవర్ ను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.
జీహెచ్ఎంసీ రీ-థింకింగ్!
అయితే, ఇప్పటికే కేబీఆర్ పార్కు ప్రాజెక్టులకు టెండర్లు ఖరారై పనులను చేజిక్కించుకున్న నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ సంస్థకు నాగార్జున జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు నిర్మించనున్న ఫ్లై ఓవర్ నిర్మాణ బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారు. అయితే భూసేకరణ వ్యయాన్ని రూ. వంద కోట్లకు మించకుండా, చాలా తక్కువ భూ సేకరణతో ఈ రెండు ఫ్లై ఓవర్లను నిర్మిస్తే, కోర్ సిటీ నుంచి ఐటీ కారిడార్ కు మరింత కనెక్టివిటీ పెరుగుతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.
ముందు చూపు లేకుండా రూపకల్పన..
ఎలాంటి ముందు చూపులేకుండా ప్రతిపాదనల రూపకల్పన సిటీలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారమంటూ జీహెచ్ఎంసీ అధికారులు జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రూపకల్పన చేసిన హెచ్ సిటీ ప్రతిపాదనలు ఏ మాత్రం ముందు చూపు లేకుండా రూపకల్పన చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఒక రద్దీ ప్రాంతంలో ఒక ఫ్లై ఓవర్ ను నిర్మించాలంటే ఆ ప్రాంతంలో ఆ ప్రాజెక్టు సాధ్యమవుతుందా? అలైన్ మెంట్ కుదురుతుందా? భూ సేకరణకు ఎంత ఖర్చవుతుంది? ప్రాజెక్టుకు ఎన్ని నిధులు వెచ్చించాల్సి ఉంటుంది? నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తే ఏఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గి, వాహనదారులకు ఉపశమనం కల్గుతుంది? అన్న అంశాల ప్రాతిపదికన ప్రైవేటు సంస్థలతో ఫీజుబిలిటీ స్టడీ నిర్వహించి, వచ్చిన నివేదికల ప్రకారం సర్కారు మంజూరీ ఇస్తేనే ప్రాజెక్టు ప్రతిపాదనలను రూపకల్పన చేసే వారు.
కేబీఆర్ పార్కు పై వాదనలు..
కానీ కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్ సిటీ పనుల కోసం రూపొందించిన ప్రతిపాదనలు కేవలం అధికారుల కమీషన్ల కోసమేనని, ప్రతిపాదనలకు ముందు వన్ వే అమలు చేసే ఫలితాలను బేరీజు వేస్తే జీహెచ్ఎంసీ నిధులు, అంతకన్నా విలువైన ఇంజనీర్లు, అధికారుల సమయం వృధా అయ్యేది కాదన్న వాదనలు కూడా ఉన్నాయి.
Also Read: సత్యమేవ జయతే.. పార్టీ ఫిరాయించిన మిగతా వారికి ఇదే గతి: కేటీఆర్