BRS Quits MLC Elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంటున్నా రెండు సార్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్లో మాత్రం చలనం కనిపించడం లేదు. తమకు అంతో ఇంతో పట్టున్న కరీంనగర్ నుంచి తాము పోటి చేస్తామని పలువురు ఆశావహులు ముందుకొస్తున్నా.. గులాబి బాస్ మాత్రం పోటీకి ససేమిరా అంటున్నారంట. ఏ ఎన్నికలు అయినా ఉప ఎన్నికలు అయినా సై అంటూ గేరు మార్చి స్పీడ్ పెంచే కారు పార్టీలో ఈ సారి మాత్రం అసలు కదలికే కనిపించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్నా.. ఆ పార్టీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇప్పటికీ ఇంకా సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటి?
తెలంగాణ రాష్ట్రం లో ఖాళీ అయిన రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నామినేషన్ల పర్వం కొనసాగుతుంది.. అయితే ఆ ఎన్నికలతో తమకేం సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు గులాబీ పార్టీ పెద్దలు.. లోక్సభ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్తో.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ అంటే భయపడి పోతున్నట్లు కనిపిస్తున్నారు. నామినేషన్ల పర్వం కొనసాగుతున్న ఇప్పటికి పోటీ చేసే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పరాజయం పాలైతే ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై మరింత రిఫ్లెక్ట్ అవుతుందన్న ఆందోళనతో ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారంట.
వాస్తవానికి పట్టభద్రులు, ఉపాధ్యాయులకి పదేళ్లలో బిఅర్ఎస్ పార్టీ చేసిందేమి లేదు. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రెండు సార్లు అధికారంలో ఉన్న పట్టభద్రుల సమస్యలు తీర్చడంలో బిఅర్ఎస్ పూర్తిగా విఫలం అయ్యిందన్నది కాదనలేని వాస్తవం.. ఇది గత ఎమ్మెల్సీ ఎన్నికలలోనే రుజువు అయ్యింది. శాసనమండలిలో ప్రశ్నించే గొంతుక ఉండాలని అధికారం లో ఉన్న బీఆర్ఎస్ని కాదని పెద్దాయన జీవన్ రెడ్డి కి పట్టం కట్టారు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఓటర్లు.
అధికారం లో ఉన్నప్పుడే పట్టభద్రులు తిరస్కరించడంతో.. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలంటేనే ఆమడ దూరంలో ఉంటుంది బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయంతోనే కుంగి పోయిన కారు పార్టీకి పార్లమెంటు ఎన్నికలలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేక గుండుసున్నాకే పరిమితం అయ్యింది. రెండు సార్లు అధికారం వెలగపెట్టిన ఆ పార్టీకి సగం లోక్సభ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదంటే.. ప్రజలు ఆ పార్టీని ఏ స్థాయిలో తిరస్కరించారో అర్థమవుతుంది.
ఆ దెబ్బతో పార్లమెంటు ఎన్నికల తరువాత గులాబాస్ కెసిఆర్ పూర్తిగా ఫౌంహౌస్ కే పరిమితం అయ్యారు. ఆయన అధికారం లో ఉన్నప్పుడు ఏనాడు కూడా బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం పై దృష్డి పెట్టలేదు. ఎవరిని నిలబెట్టినా తన ముఖం చూసి ఓటేస్తారన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో సంస్థాగతం పార్టీని బలోపేతం చేయాలన్న అంశాన్నే పట్టించుకోలేదు. ఆ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. గతంలో బీఅర్ఎస్లో చేరడానికి నేనంటే నేనని పోటీ పడి వచ్చిన నాయకులు ఇప్పుడు నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యమం సమయం నుంచి ఆ పార్టీతో ఉన్న వారు తప్ప అధికారాన్ని చూసి వచ్చి చేరిన వారంతా కారు దిగేసి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.
పార్లమెంటు ఎన్నికల తరువాత కేసీఆర్ ప్రజలకు దూరమవ్వడంతో.. బీఆర్ఎస్ పార్టీ జవసత్వాలు లేకుండా తయారైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రావులు ఎంత బూస్టప్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా.. వలసలు మాత్రం ఆగడం లేదు. ఉన్న నాయకులు, కేడర్ కూడా పార్టీ పిలుపు ఇస్తే తూతు మంత్రంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం కోసం ఒక్కటంటే ఒక్క మీటింగ్ కూడా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఓటమి తరువాత నిర్వహించలేకపోయారు.
అటు చూస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలాఖరులో భారీ బహిరంగసభ అంటున్నారు. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలు వెలువడతాయి. అంటే 28 రోజులు మాత్రమే ఉండే ఫిబ్రవరి నెల ఆఖరులో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. మరి అటువంటప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభ ఎలా పెడతారో? అన్న డౌట్లు గులాబీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి.
ఏడాది నుంచి కేసీఆర్ ఫాం హౌస్కే పరిమితమై .. అప్పుడప్పుడు స్టేట్మెంట్లకు పరిమితమవుతుండటంతో గులాబీ కేడార్ ఆయన్ని నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. అది గ్రహించే అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతే మర్చిపోయినట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారంట. స్థానిక సంస్థలు సమీపించడానికి ముందు ఎమ్మెల్సీ పోరులో నిలబడి అంతో ఇంతో సత్తా చాటుకుంటే పార్టీకి జవసత్వాలు వచ్చేవని.. అయితే ఆయన అసలుకే కాడె వదిలేయడం కేడర్కు మింగుడు పడటం లేదంట. దాంతో క్యాడర్ కూడా అధిష్టానం లేని పట్టింపు మాకేం అనుకుంటున్నారో ఏమో అసలా ఎన్నికల గురించి ఆలోచించడమే మానేశారు.
Also Read: పెద్దాయన.. ఇక చాలని అనుకుంటున్నారా?
తెలంగాణలో బీఆర్ఎస్ గ్రౌండ్ లెవల్ నుండి బలంగా ఉండేది. ఉద్యమ పార్టీ నుంచి పొలిటికల్ పార్టీగా మారడంతో గట్టి క్యాడరే ఉంది. అయితే ఇప్పుడు కార్యకర్తలకి దిశానిర్దేశం చేసేవారే కరువయ్యారు. అటూ కేసీఆర్ పూర్తిగా రెస్ట్లో ఉండడం.. దిశానిర్దేశం చేయాల్సిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి కేసులతో అవినీతి మరకలు అంటుకోవడం.. ఆయన పార్టీ బలోపేతం కంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడానికే ప్రాధాన్యత ఇస్తుండటం.. కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కాం కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్ళిరావడం ఇప్పుడు బీఅర్ఎస్ ని పూర్తిగా డిఫెన్స్లో పడేసిందని చెప్పవచ్చు..
ఇలాంటి పరిస్థితుల్లో కేడర్ని యాక్టివ్గా ఉంచాలంటే ఏదో ఒక యాక్టివిటీ కావాలి. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపోటములు ఎలా ఉన్నా పోటీ చేస్తే పార్టీకి పునరుజ్జీవం వస్తుందని పార్టీ శ్రేణులు భావించాయి. అయితే ఎలాగూ పట్టభద్రులు గత ఎన్నికలలో కొర్రు కాల్చి వాతలు పెట్టారు. వారికి ఇస్తాన్న నిరుద్యోగ భృతి ఎలాగూ ఇవ్వలేదు. ఉద్యోగాల నోటిఫికేషన్ లు వేయలేదు. ఇంకా పట్టభద్రులు మనకేం అండగా ఉంటారనుకున్నారేమో గులాబీ బాస్ ఎప్పటిలాగే తన నిర్ణయం తాను తీసేసుకోవడంతో కేడర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంది.
కరీంనగర్ మాజీ మేయర్, సివిల్ సప్లై కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ తాను పోటీ చేస్తానని ముందుకు వచ్చినా కేసీఆర్ గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడం లేదంట. ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. హరికృష్ణ తన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ గా పొటీ చేయడానికి ముందుకు వచ్చి నాలుగు నెలల ముందు నుండే పట్టభద్రుల ఓటర్లను కలుస్తున్నారు. పట్టభద్రుల్లో హరికృష్ణకి పాజిటివ్ నెస్ ఉండడంతో బీఅర్ఎస్ నేతలు తమ పార్టీ తరుపున హరికృష్ణ బరిలో ఉంటే గెలిచే అవకాశం ఉందని కెటీఆర్, హరీష్రావుల దృష్టికి తీసుకెళ్లారంట. వారు ఆ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే.. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారంట. కేసీఆర్ దానికే ఫిక్స్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో? ఇప్పటి నుంచే పార్టీ కేడర్ ఊహించేసుకుంటుందంట.