Jeevan Reddy vs Sanjay Kumar: సహజంగా అధికార అంటే ఆధిపత్యపోరు, విబేధాలు పెద్దగా కనిపించవు. ఒక వేళా ఉన్నా అవి బయటకు రావు. పార్టీ పెద్దల బుజ్జగింపులతోనో? ఇంకో రకంగానో సర్దుకపోతుంటారు. అయితే అందుకు బిన్నంగా ఉంది జగిత్యాల నియోజకవర్గం పరిస్థితి. అక్కడ అధికార కాంగ్రెస్లో విబేధాలు రోజురోజుకు రచ్చకెక్కుతున్నాయి. ఇద్దరు ముఖ్య నేతలు సంజయ్, జీవన్రెడ్డిలు విమర్శలు, ప్రతి విమర్శలతో చెలరేగిపోతున్నారు. ఆ ఇద్దరు తగ్గేదేలేదంటూ మాటల యుద్ధం కొనసాగిస్తుండటంతో కాంగ్రెస్ క్యాడర్ అయోమయానికి గురవుతోందంట. అసలు జగిత్యాల కాంగ్రెస్లో ఆ పరిస్థితికి కారణమేంటి?
జగిత్యాల కాంగ్రెస్లో సంజయ్, జీవన్రెడ్డిల మధ్య విబేధాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు అధిష్టానానికి తలనొప్పిగా మారిపోయాయి. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విబేధాలు మరింత ముదిరిపోయాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో.. ఇక్కడ కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచీ సంజయకుమార్ పోటీ చేశారు. సంజయ్ కుమార్ వరుసగా రెండో సారి జీవన్రెడ్డిపై విజయం సాధించారు. జీవన్ రెడ్డి ఓడిపోయినా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తనకే ప్రాధాన్యత ఉంటుందని అప్పటికి ఎమ్మెల్సీగా ఉన్న జీవన్రెడ్డి భావించారు.
కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంజయ్కుమార్
తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలోసంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచీ జీవన్రెడ్డి తన విమర్శలకు పదును పెట్టారు. ఆరంభంలోనే సంజయకుమార్ రాకను తీవ్రంగా వ్యతిరేకించడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ పిలిపించి పంచాయతీ పెట్టి బుజ్జగించాల్సి వచ్చింది. అయినా ఇప్పటికీ జీవన్రెడ్డి ఎమ్మెల్యేకి యాంటీగానే ఉన్నారు. ఎన్నో సార్లు పార్టీ పెద్దల బుజ్జగించినా ఈ సీనియర్ నేత.. అదే ధోరణితో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మరోసారి ఆ ఇద్దరు విమర్శలు చేసుకుంటున్నారు.
సంజయ్ కాంగ్రెస్లో ఉన్న విషయం జీవన్కి తెలియదంట
సంజయ్కుమార్ను ఉద్దేశించి.. ఆయన కాంగ్రెస్ లో ఉన్న విషయం తెలియదని.. పార్టీ మారడం తనకు నచ్చదని జీవన్రెడ్డి మళ్లీ మాటల యుద్దం మొదలుపెట్టారు. అధిష్టానంపై కూడా పైర్ అవుతున్నారు. జీవన్రెడ్డి వైఖరితో జగిత్యాల జిల్లాకు మంత్రులు రావాలంటే భయపడుతున్నారంట. ఇటీవల.. జగిత్యాల జిల్లాకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జీవన్రెడ్డి వినతి పత్రం ఇచ్చిన తరువాత.. శ్రీనివాస్ రెడ్డి ఆయన్ని ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ జీవన్రెడ్డి వెనక్కి వెళ్లిపోయారు. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాంతో మిగతా మంత్రులు కూడా జగిత్యాల పర్యటనకు రావాడానికి ఒక్కటిక రెండు సార్లు ఆలోచిస్తున్నారంట.
Also Read: కాంట్రవర్సీలకి కేర్ అఫ్గా మారుతున్న పిఠాపురం
ప్రతి విమర్శలు మొదలుపెట్టిన సంజయ్ కూమార్
జీవన్రెడ్డి ఎదో ఒక్క సంచలన కామెంట్ చేస్తూనే వస్తున్నారు. అధికార పార్టీని ఇరుకునే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్వపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఇప్పుడు ప్రతి విమర్శలు చేస్తున్నారు. అత్యధిక సార్లు ఓడిపోయిన జీవన్రెడ్డి అని యద్దేవా చేశారు. జీవన్రెడ్డి కూడా గతంలో పార్టీ మారారని గుర్తు చేస్తున్నారు. జగిత్యాలకు చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య గిల్లిగజ్జాలు కొనసాగుతూనే ఉండటంతో క్యాడర్ తలలు పట్టుకుంటోంది. ఏ నేత దగ్గరికి వెళ్లాలో అర్థం కావడం లేదని వాపోతోంది.
విభేదాలపై సైలెంట్గా ఉంటున్న అధిష్టానం
జగిత్యాల కాంగ్రెస్లో రోజు.. రోజుకు విబేధాలు పెరుగుతున్నా.. అధిష్టానం మాత్రం సైలెంట్గా ఉంటుంది. ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. పార్టీ మారిన సంజయ్కుమార్కి .. ఈ వ్యవహారాలన్నీ తలనొప్పిగా మారుతున్నాయంట. ఆ ఇద్దరు నేతలు అలా కొట్టుకుంటుంటే.. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి కాంగ్రెస్ పెద్దలు వారి పంచాయితీకి ఎలా ఫుల్స్టాప్ పెడతారో చూడాలి.