టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ ఇద్దరికి హితవు పలికారు. ఎవరా ఇద్దరు? ఒకరు సీఎం రేవంత్ రెడ్డి, మరొకరు కేటీఆర్. ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఓ పత్రిక వార్షికోత్సవంలో మహేశ్కుమార్ గౌడ్తో పాటు కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ వేదికగా మహేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎవరు తప్పు చేసినా పత్రిక ఎత్తి చూపాలని, ఆ తప్పులను పాలకులు తెలుసుకుని, పద్దతి మార్చుకోవాలని అన్నారు మహేశ్. హద్దులు దాటి ఎవరూ మాట్లొడొద్దని, కానీ, సీఎం రేవంత్రెడ్డితో పాటు.. కేటీఆర్ కూడా హద్దులు మీరి మాట్లాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.
వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరికి కక్షలు, ప్రతీకారాలు ఉండకూడదని, తనకు అలా ఉండదని చెప్పిన ఆయన.. రాజకీయంగా పాలసీలపై, సిద్దాంతాలపై విమర్శలు చేసుకోవడం సహజమని, ఇది కూడా ఆరోగ్యకరంగా ఉండాలని కోరారు. ఈ విషయంలో ఇద్దరూ హద్దులు దాటుతున్న విషయాన్ని సుతిమెత్తగా ఆయన ప్రస్తావిస్తూనే .. ఇది మంచి పద్దతి కాదనే విధంగా హితవు పలికారు.
కేటీఆర్ వేదికపైనే ఉండటంతో ఇద్దరినీ కలిపి మహేశ్ మాట్లాడంతో ఇది చర్చకు వచ్చింది. కేసీఆర్ను తను గౌరవిస్తానని, ఆయన వయస్సులో పెద్దవారని, ఉద్యమ దళపతి అని కొనియాడారు. కానీ, ఆయన అసెంబ్లీకి రావాలి.. తన అనుభవాలను పంచుకోవాలి.. అని సూచన చేశాడు మహేశ్.
సోషల్ మీడియా విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఎక్కువగా ఫేక్ ప్రచారాలకు వేదికగా అవుతోందన్నారు. దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలని, అందులో వచ్చి ప్రతీ వార్తను నిజమని భ్రమించి.. వెంటనే ఓ నిర్ణయానికి రావొద్దని సూచన చేశారు. ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద జరిగిన ఆందోళన.. పాలకులకు ఓ గుణపాఠం లాంటిందన్నారు.
పాలకుడు తనకు నచ్చినట్టు నడుచుకుంటానని , ప్రజల అభీష్టాన్ని పట్టించుకోనని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎలా తిరుగుబాటు వస్తుందో జెన్జీ తెలియజెప్పిందన్నారు. ఇది అందరి పాలకులకు వర్తిస్తాయని, ఈ ఉద్యమానికి అంతా జేజేలు పలికారని గుర్తు చేశాడు మహేశ్. ఒకే వేదికపై అధికార, విపక్ష నాయకులు పాల్గొనడం కూడా ఓ మంచి రాజకీయ వాతావరణానికి సంకేతమని అన్నాడు మహేశ్.
తనకు కేటీఆర్, హరీశ్, కేసీఆర్లపై వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదని, వారిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా రాజకీయం చేయనని, ఎవరూ అలా చేయవద్దని కోరారు. పార్టీలేవైనా, నాయకులెవరైనా.. ఇదే విధానంతో ముందుకు పోవాలన్నారు. ప్రతికాస్వేచ్చను బతికించినప్పుడే ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లుతుందన్నారు.