మేమే వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న కేటీఆర్ నోటి వెంట హామీల అమలుపై ఆసక్తికర కామెంట్స్ వచ్చాయి. వచ్చేది మేమే.. సీఎంగానే కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెడతారు.. అని కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్.. చేతగాకపోతే దిగిపోవాలని కూడా సీఎం రేవంత్కు ఉచిత సలహా ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ, తాము అధికారంలోకి వచ్చినా.. వెంటనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయలేమని కామెంట్ చేయడం మాత్రం హాట్ టాపిక్గా మారింది.
సీఎం రేవంత్రెడ్డి ఆర్థిక వ్యవస్థను చెరబట్టారని విమర్శించిన కేటీఆర్.. ఇది కుదురుకోవాలంటే ఐదారేండ్ల సమయం పట్టొచ్చనే విధంగా మాట్లాడటం కూడా చర్చనీయంశమవుతోంది. అప్పుల విషయంలో అటు అధికార పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆరెస్ చెరో మాటగా చెప్పుకుంటూ వస్తున్నారు.
కేసీఆర్ రూ. 8.14 లక్షల కోట్ల అప్పులు చేశారని అధికార పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. దీన్ని బీఆరెస్ ఖండిస్తూ వస్తోంది. మొత్తం ఆర్థిక వ్యవస్థను కుప్ప చేసి పెట్టారని ఆరోపించిన కేటీఆర్.. ఒక్క మద్యం ఆదాయం మినహా మిగిలిన అన్ని శాఖల్లో ఆదాయం పడిపోయిందని విమర్శించారు తాజాగా.
రోజుకు రూ. 450 కోట్ల అప్పులు చేస్తున్నారని, రోజువారీ లెక్కలు తీసి చెప్పారు కేటీఆర్. రేవంత్ సర్కార్ వచ్చిన తరువాత ఆర్థిక విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. అందుకే తాము అధికారంలోకి వచ్చినా.. వెంట వెంటనే హామీలు అమలు చేయలేమనే విధంగా ఆయన చేతులెత్తేసినట్టే మాట్లాడారు.
ఓ వైపు కేసీఆర్ ఫామ్హౌజ్లో ఉండి కొంగొత్త పథకాల రూపకల్పన చేస్తున్నారని, ప్రజలకు ఇంకా మెరుగైన సంక్షేమాన్ని అందించడం కోసం ఆయన రోజూ మేధోమథనం చేస్తున్నారని ఆ పార్టీ నేతలే ప్రకటించుకున్నారు. ఓ రకంగా రాబోయే సాధారణ ఎన్నికల కోసం బీఆరెస్ మ్యానిఫెస్టో తయారు చేస్తున్నారనే విధంగా .. కాంగ్రెస్ చేసిన ఫామ్హౌజ్ ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తుంటే.. కేటీఆర్ మాత్రం ఈ విధమైన కామెంట్స్ చేయడంతో కాంట్రాస్ట్ కామెంట్స్పై చర్చ జరుగుతోంది.
చేతగాకపోతే దిగిపో అని రేవంత్రెడ్డికి సూచించిన కేటీఆర్.. తమకు అధికారం ఇచ్చినా హామీల అమలు చేతకాదని ఇప్పుడే చేతులెత్తేసే విధంగా మాట్లాడటం చర్చకు తెర తీసినట్టయ్యింది. వచ్చే ఎన్నికల్లో పోటాపోటీ హామీలు గుప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ ప్రధానమైన ఈ రెండు పార్టీలు అప్పుల జపం చేస్తున్నాయి. మరి అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ అవే పాత ముచ్చట్లు, అప్పుల తిప్పలు చెప్పి తప్పించుకుంటారా? అనే డిస్కషన్ కూడా జరుగుతోంది జనాల్లో.