BigTV English

Indian Army Day : సైనికా.. నీకు వందనం..!

Indian Army Day : సైనికా.. నీకు వందనం..!
Indian Army Day

Indian Army Day : దేశంలోని కోట్లాది మంది ఎలాంటి భయంలేకుండా జీవించగలుగుతున్నారంటే.. ఆ ఘనత మన సైన్యానిదే. రేయింబవళ్లు అప్రమత్తంగా ఉంటూ సరిహద్దును కాపాడే సైనికుల త్యాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశానికి అన్నంపెట్టే రైతుతో బాటు అంత గౌరవం దక్కేది సైనికుడికే. వారి వీరోచిన పోరాటాలను, విధి నిర్వహణలో వారు చూపిన అసమాన సేవలకు గుర్తుగా మన సైన్యం ఏటా జనవరి 15న ‘సైనిక దినోత్సవం’ నిర్వహిస్తోంది. మాతృభూమి రక్షణకై అసువులు బాసిన ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకునే అరుదైన సందర్భమిది.


1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం సిద్ధించింది. అయినా.. 1949 జనవరి 14 వరకు సైన్యం బాధ్యతలను నాటి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నిర్వహించారు. జనవరి 15న బుచర్ నుంచి ఆ కమాండర్-ఇన్-చీఫ్‌ బాధ్యతలను జనరల్ కె.ఎమ్.కరియప్ప స్వీకరించారు. 200 ఏళ్ల తర్వాత బ్రిటిష్ వారి నుంచి భారతీయ అధికారి సేనాధిపత్యం వహించిన ఆ రోజును నాటి నుంచి ఆర్మీ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏటా ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో ఉన్న అమరజవాన్ జ్యోతి వద్ద పెరేడ్, అమరవీరులకు నివాళులు అర్పించే కార్యక్రమం నిర్వహిస్తారు.

కె.ఎమ్.కరియప్ప పూర్తిపేరు కోదండరా కిప్పర్ మాదప్ప కరియప్ప. 1899 జనవరి 28న కర్ణాటకలోని కూర్గ్‌‌లో జన్మించిన కరియప్ప మద్రాసులో విద్యాభ్యాసం పూర్తి చేసి, బ్రిటీష్‌ ఆర్మీలో సైనికుడిగా చేరారు. తొలి ప్రపంచ యుద్ధం (1914-1918) సమయంలో సైనిక శిక్షణ పొందిన కరియప్ప ఇరాన్‌, ఇరాక్‌, సిరియా, బర్మాలలో విశేష సేవలందించారు. బ్రిటన్‌లోని క్యాంబర్లీలో ఉన్న ఇంపీరియల్ డిఫెన్స్ కాలేజీలో శిక్షణకు ఎంపికైన తొలి ఇద్దరు భారతీయులలో ఆయన ఒకరు.


ఫతేగఢ్‌లో కరియప్ప పనిచేస్తున్న రోజుల్లో ఒక బ్రిటిష్ అధికారి భార్య కరియప్ప అనే పేరు పలకలేక.. ‘కిపర్’ అని పిలవడం ప్రారంభించారని, ఆ తర్వాత అది ఆయన పేరులో భాగమైందని చెబుతారు. 1942లో కరియప్ప, లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందిన తొలి భారతీయ అధికారి అయ్యారు. 1944లో ఆయన బ్రిగేడియర్‌గా మారిన తర్వాత బన్నూ ఫ్రాంటియర్ బ్రిగేడ్‌కు ఆయన కమాండర్‌గా నియమితులయ్యారు. 1947 నాటి పాకిస్థాన్‌ యుద్ధంలో కరియప్ప వెస్ట్రన్ ఫ్రంట్‌కు కమాండర్‌గా యుద్ధంలో పాల్గొన్నారు.

భారత సైన్యం.. 1986లో రిటైర్మెంట్ తరువాత ఆయనను ఫీల్డ్ మార్షల్ ర్యాంక్‌తో ఆయనను గౌరవించింది. నాటికి ఆయన వయసు 86 ఏళ్లు. ఈ గౌరవం దక్కిన మరొక వ్యక్తి.. సామ్ మానెక్ షా. తన 49వ ఏట సైన్యాధ్యక్షుడైన కరియప్ప అంతకు ముందు ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్, వెస్టర్న్ కమాండ్స్‌ కమాండర్‌గా పనిచేశారు. రెండవ ప్రపంచయుద్ధంలో బ్రిటీష్ ఆర్మీ తరపున పోరాడి బర్మాలో జపానీయులపై విజయం సాధించినందుకు జనరల్ కరియప్పకు ‘ఆర్డర్ ఆఫ్‌ ది బ్రిటీష్ ఎంపైర్’ అవార్డు కూడా లభించింది.

భారతీయుడిగా బ్రిటిష్ సైన్యంలో తీవ్ర వివక్షతను ఎదుర్కొన్న కరియప్ప..భారత సైన్యంలోని ప్రాంతీయ భావాలను రూపుమాపి ‘జైహింద్‌’ నినాదాన్ని తీసుకుని వచ్చారు. 1947 నవంబర్‌లో రాంచీ ఈస్ట్రన్ కమాండ్ చీఫ్‌గా ఉండగా దిల్లీ, ఈస్ట్ పంజాబ్ జీఓసీ ఇన్ చీఫ్‌గా ఉన్న జనరల్ డడ్లీ స్థానంలో ఆయనను కశ్మీర్ పంపారు. కరియప్ప ఛార్జ్ తీసుకోగానే.. పై అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ కార్గిల్, డ్రాస్, జోజిలా ప్రాంతాల్లో మన సైన్యాన్ని నడిపించాడు. ఆయన అలా చేసి ఉండకపోతే లేహ్ నేడు భారత్‌లో భాగంగా ఉండకపోయేది.

బ్రిటిషర్ల హయాంలో 1776లో తొలిసారి బ్రిటీషు సైన్యంలో ఒక చిన్న భాగంగా మొదలైన భారత సైన్యపు యూనిట్ .. 1895లో ‘బ్రిటీష్ భారతీయ సేన’ (బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ)గా రూపాంతరం చెంది 1949లో కరియప్ప నాయకత్వంలో ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్‌గా అవతరించింది. 1953లో రిటైర్ అయిన కరియప్ప, 94 ఏళ్ల వయస్సులో 1993లో కన్నుమూశారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×