Kailash Mansarovar Yatra: పవిత్ర మానస సరోవర్ యాత్ర.. మళ్లీ మొదలుకాబోతోంది. ఈ తీర్థయాత్రను తిరిగి ప్రారంభించాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఐదేళ్ల తర్వాత మొదలుకాబోతున్న ఈ యాత్ర.. ఈసారి ఎలా ఉండబోతోంది? కైలాస పర్వతానికి ఎలా వెళ్లాలి? మానస సరోవర్ సరస్సుకి ఎలా చేరుకోవాలి? ఈ ఆధ్యాత్మిక టూర్కి వెళ్లేందుకు ఎవరు అర్హులు? మొత్తం.. ఎంత ఖర్చవుతుంది?
కైలాస మానస సరోవర్ యాత్రకు గ్రీన్ సిగ్నల్
భారతీయులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే కైలాస మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి భారత్-చైనా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాయి. కరోనా కారణంగా కైలాస మానస సరోవర్ యాత్ర ఆగిపోయింది. ఆ తర్వాత.. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. ఇన్నేళ్ల పాటు ఈ పవిత్ర యాత్రని నిర్వహించలేదు. అయితే.. గత కొన్నేళ్లుగా భారత్-చైనా మధ్య నెలకొన్న వివాదాలు.. ఇటీవలికాలంలో తగ్గుముఖం పడుతున్నాయి. దాంతో.. రెండు దేశాల మధ్య మళ్లీ స్నేహపూర్వక సంబంధాలు బలపడుతున్నాయి.
రెండు దేశాల మధ్య మళ్లీ స్నేహపూర్వక సంబంధాలు
ఈ క్రమంలోనే.. భారత్-చైనా మధ్య కీలక నిర్ణయాలు కొలిక్కి వచ్చాయి. రాబోయే వేసవిలో కైలాస మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. అయితే.. హిమాలయాల్లో కొలువైన కైలాస పర్వతానికి ఎలా చేరుకోవాలి? సాక్షాత్తూ ఆ శివుడే కొలువై ఉన్నాడని నమ్మే ప్రదేశాన్ని ఎలా దర్శించుకోవాలి? దేవతలు స్నానమాచరిస్తారని భావించే.. పవిత్ర మానస సరోవర్ సరస్సుకి ఎలా చేరుకోవాలి? అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది.
కైలాస మానస సరోవర్ యాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
చార్ ధామ్ యాత్ర, అమర్నాథ్ యాత్రల మాదిరిగానే.. కైలాస మానస సరోవర్ యాత్రకు కూడా మన భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా.. ఇది హిందువులు, బౌద్ధులు, జైన భక్తులకు అత్యంత ప్రముఖమైన, గౌరవప్రదమైన యాత్ర. హిమాలయాల్లో నెలవైన కైలాస పర్వతం.. ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మొత్తం భూమికి ఆధ్యాత్మిక కేంద్రంగా కైలాస పర్వతం ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యాత్రికులు, యోగులు దీనిని సందర్శిస్తారు. పూజిస్తారు. ముఖ్యంగా.. ఆ పరమశివుని మోక్షానికి అత్యంత పవిత్రమైన యాత్రగా పరిగణిస్తారు. కైలాస పర్వతం కొలువైన ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయి ఉంటుందని నమ్ముతారు.
భారతీయులకు కైలాస పర్వతం.. సాధారణ శిఖరం కాదు
భారతదేశ ప్రజలకు.. కైలాస పర్వతం.. ఓ సాధారణ శిఖరం కాదు. ప్రధానంగా హిందువులంతా కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా భావిస్తారు. శివపార్వతులు అక్కడే ఉంటారని నమ్ముతారు. అందుకోసమే.. హిందూ మతంలో కైలాస పర్వతానికి ఇంతటి ప్రాముఖ్యత ఉంది. జైన మతం ప్రకారం.. తొలి జైన తీర్థంకరుడు మోక్షం పొందిన ప్రదేశం కైలాసం. బౌద్ధమతంలో.. కైలాస పర్వతంపైనే బుద్ధుడు నివసిస్తుంటాడని నమ్ముతారు. టిబెట్లో బౌద్ధమతానికి పూర్వం ఉన్న బాన్ మతం కూడా.. ఈ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శక్తికి స్థానం అని నమ్ముతుంది. అందుకోసమే.. కైలాస పర్వతాన్ని నాలుగు మతాల వారు అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు.
సముద్ర మట్టానికి 22 వేల అడుగుల ఎత్తులో కైలాస పర్వతం
సముద్ర మట్టానికి 22 వేల అడుగుల ఎత్తులో.. ఓ రాతి పిరమిడ్లా కనిపించే శిఖరమే కైలాస పర్వతం. ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఈ పర్వతం.. అచ్చం శివలింగంలా కనిపిస్తుంటుంది. ఈ పర్వతం.. స్వయంభువు అని నమ్ముతారు. ఈ పర్వతాన్ని దర్శించుకునేందుకు వెళ్లే యాత్రికులు.. అక్కడ కైలాస పరిక్రమ్ ఆచారాన్ని పాటిస్తారు. ఈ శిఖరం చుట్టూ చేసే ప్రదక్షిణనే కైలాస పరిక్రమ్గా పిలుస్తారు. ఈ ప్రదక్షిణ పూర్తి చేసేందుకు 2 నుంచి 3 రోజులు పడుతుంది.
అదృష్టం, భగవంతుని ఆశీస్సులు లభిస్తాయనే నమ్మకం
కైలాస పరిక్రమ్ పూర్తి చేయడం వల్ల జీవితంలో అదృష్టం, భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. దీనిని ఆనుకొనే మానస సరోవరం సరస్సు ఉంటుంది. ఇది.. స్వచ్ఛతకు, మోక్షానికి మూలంగా పరిగణిస్తారు. అందులో.. సాక్షాత్తూ దేవతలు వచ్చి స్నానమాచరిస్తారని నమ్ముతారు. అందుకే.. ఈ కైలాస మానస సరోవరం యాత్రకు ఇంతటి ప్రాముఖ్యత. ఈ పవిత్ర యాత్రని.. అంతిమ తీర్థయాత్రగా పరిగణిస్తారు. ఈ యాత్ర.. జ్ఞానోదయం కలిగిస్తుందని, కొత్త జీవితాన్ని ప్రారంభించేలా మనస్సుని మారుస్తుందని చెబుతారు.
కైలాస మానస సరోవర్ యాత్రకు పాస్ పోర్ట్ కంపల్సరీ
కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లాలంటే.. పాస్పోర్ట్ కచ్చితంగా ఉండాలి. ఈ జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు మధ్యలోని వారై ఉండాలి. బాడీ మాస్ ఇండెక్స్ 27 కంటే తక్కువ కలిగి ఉండాలి. శారీరంగా ధృడంగా, ఆరోగ్యవంతులై ఉన్న వాళ్లు మాత్రమే ఈ ఆధ్యాత్మిక యాత్రకు అర్హులు. ఈ కైలాస మాన సరోవర్ యాత్రను పూర్తి చేయాలంటే.. ఒక్కో భారతీయుడికి లక్షా 40 వేల నుంచి లక్షన్నరకు పైనే అవుతుంది. ఇందులో.. రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఇతర ఖర్చులన్నీ కలిపి ఉంటాయి. యాత్రకు వెళ్లే వారికి.. చైనా వీసా కోసం కొంత చెల్లించాల్సి ఉంటుంది.
చైనా ప్రభుత్వానికే రూ.50 వేలకు పైగా చెల్లించాలి
అలాగే.. మెడికల్ టెస్టులతో పాటు టిబెట్లో బస చేసేందుకు, ప్రయాణాలకు, చైనా ప్రభుత్వానికి భారీగానే చెల్లించాలి. కేవలం.. వీటికే 50 వేలకు పైగా ఖర్చవుతుంది. యాత్రికుల లగేజీలు తీసుకెళ్లే పోర్టర్స్ కోసం, గుర్రాల కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా.. మొత్తం కలిపి దాదాపు లక్షన్నర దాకా ఈ కైలాస మానస సరోవర్ యాత్రకు ఖర్చవుతుంది. కైలాస పర్వతం, మానస సరోవరం సరస్సు.. ఈ ప్రపంచంలోని భౌగోళిక అద్భుతాలు మాత్రమే కాదు.. కొన్ని శతాబ్దాలుగా ఎంతోమందిని ఆకర్షించి మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఆధ్యాత్మికతకు చిహ్నాలు. అందుకోసమే.. ఎంత ఖర్చయినా ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర స్థలాలను సందర్శించేందుకు వెళ్తుంటారు.
సరిహద్దుల్లో ఏర్పడిన ప్రతిష్టంభనకు బ్రేక్
కరోనా తర్వాత తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో.. రెండు దేశాల మధ్య తలెత్తిన వివాదం ముగిసిపోయింది. దాంతో.. సరిహద్దుల్లో ఏర్పడిన ప్రతిష్టంభనకు బ్రేక్ పడింది. ఇప్పటికే.. రెండు దేశాలకు చెందిన సైన్యాలు.. సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లిపోయాయ్. ఈ క్రమంలో.. రెండు దేశాల మధ్య మళ్లీ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ ప్రక్రియ మొదలైంది. గతేడాది భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ రష్యాలోని కజాన్లో భేటీ అయ్యారు.
ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు
ఆ సమావేశం తర్వాతే.. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనడం మొదలైంది. అందులో భాగంగానే కైలాస మానస సరోవర్ యాత్ర ప్రారంభించాలని భారత్-చైనా కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాదు.. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు కూడా సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లుగా.. భారత విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం.. భారత్-చైనా మధ్య సంబంధాలు పెంపొందించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు విదేశాంగ శాఖ అధికారులు.
హైడ్రాలాజికల్ డేటా బదిలీ విషయంలోనూ సహకారం
ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు అనుగుణంగా.. కైలాస మాసన సరోవర్ యాత్రకు సంబంధించిన అన్ని విషయాలపై సంబంధిత అధికారులు చర్చలు జరపనున్నారు. అదేవిధంగా.. సరిహద్దు నదులకు సంబంధించిన నీటి వనరుల డేటా, హైడ్రాలాజికల్ డేటా బదిలీ విషయంలోనూ పూర్వ సహకారాన్ని పునరుద్ధరించాలని.. రెండు దేశాలు నిర్ణయించాయి. అలాగే మీడియా, థింక్ ట్యాంక్ మధ్య సమావేశాలు నిర్వహించడంతో పాటు ఇతర సహకారంపైనా.. రెండు దేశాల నిపుణుల బృందం చర్చలు మొదలుపెట్టాలనే అంగీకారానికి వచ్చామని.. విదేశాంగ శాఖ ప్రకటించింది.
భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు
మరోవైపు.. భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై.. 75 ఏళ్లు గడుస్తోంది. ఈ క్రమంలో.. రెండు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయనే చర్చ కూడా వినిపిస్తోంది. రెండు దేశాల ప్రజల మధ్య మంచి పౌర సంబంధాలు పెంపొందించే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. ఇరు దేశాల ప్రజలకు ఒకరిపై ఒకరికి విశ్వాసం కలిగేలా.. అవగాహన పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. 75 ఏళ్ల ద్వైపాక్షిక బంధాన్ని గుర్తు చేసుకునేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మంచి పౌర సంబంధాలు పెంపొందించే కార్యక్రమం
తూర్పు లద్దాఖ్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంట్ పెట్రోలింగ్ విషయంలో.. ఇప్పటికే చైనాతో ఒప్పందం కుదిరింది. దాంతో.. రెండు దేశాల మధ్య ఘర్షణకు కేంద్ర బిందువుగా మారిన డెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్కు మార్గం సుగమమైంది. 2020 గల్వాన్ ఘర్షణకు ముందు లాగే.. రెండు దేసాల సైనికులు ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక.. భారత్తో సంబంధాలపై చైనా కూడా సానుకూలంగానే కనిపిస్తోంది.
భారత్తో సంబంధాలపై సానుకూలంగా కనిపిస్తున్న చైనా
బీజింగ్లో.. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. రెండు దేశాలు పరస్పర మద్దతు, లక్ష్యసాధనకు ప్రాధాన్యమివ్వాలని వాంగ్ యీ చెప్పారు. రెండు దేశాలు పరస్పరం అనుమానాస్పద దృష్టితో చూడటం, దూరంగా ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చైనా అభిప్రాయపడింది. గతేడాది బ్రిక్స్ సమావేశంలో.. మోడీ, చైనా మధ్య జరిగిన సమావేశం తర్వాత.. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. రెండు దేశాలు.. ప్రజల ప్రాథమిక ప్రయోజనాల కోసమే పనిచేయాలనే ఆలోచనతో ఉండాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని చైనా ఆశిస్తోంది.