Donald Trump: ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాయనుకున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిడుగులాంటి వార్త చెప్పారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల తర్వాత చమురు సంక్షోభం తీరుతుందని ఆశించిన అంతర్జాతీయ సమాజానికి ట్రంప్ నిర్ణయం కోలుకోలేని షాక్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై రక్షణ పేరిట ఏకంగా 20 శాతం పన్ను (ట్యాక్స్) విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇరాన్ ముప్పు నుంచి తామే రక్షణ కల్పిస్తున్నందున ఈ పన్ను కట్టాల్సిందేనని ప్రపంచ దేశాలకు హుకూం జారీ చేశారు.
తెరపైకి హర్మూజ్ వివాదం
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం, ఆ తర్వాత శాంతి చర్చలతో పరిస్థితులు సర్దుమణిగాయని అంతా భావించారు. కానీ అమెరికా మళ్లీ ఇరాన్ను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడడంతో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడమే కాకుండా, ఆ మార్గంలో వెళ్లే నౌకలపై దాడులకు దిగింది. ఈ ఉద్రిక్తతలను ఆసరాగా చేసుకుని, హర్మూజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన ట్రంప్.. రక్షణ ముసుగులో ట్యాక్స్ బాంబ్ పేల్చారు.
Also Read: వైష్ణవి, జాహ్నవిల జాడ ఏది? కన్నవారి కన్నీటికి సమాధానం ఎక్కడ? పోలీసులు ఫెయిల్?
కోలుకోలేని దెబ్బ.. ఆర్థిక సంక్షోభం!
అసలు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడానికి, బహుళ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం కావడానికి అమెరికా దూకుడు వైఖరే ప్రధాన కారణం. యుద్ధం తెచ్చిపెట్టిన నష్టాల నుంచి దేశాలు బయటపడకముందే.. ఇప్పుడు రక్షణ చార్జీల పేరుతో అమెరికా ఇలా గ్లోబల్ వసూళ్లకు దిగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం రక్షణ కోసం తీసుకున్న నిర్ణయం కాదని, వ్యూహాత్మకంగా ప్రపంచ దేశాల నుంచి సొమ్ము దండుకోవడానికేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
భారత్పై పడే ప్రభావం ఏంటి?
భారత్ తన చమురు అవసరాల కోసం అత్యధికంగా పశ్చిమాసియా దేశాలపైనే ఆధారపడుతుంది. అందువల్ల హర్మూజ్ జలసంధిపై విధించే 20 శాతం అదనపు చార్జీల ప్రభావం నేరుగా మన దేశంపై పడనుంది. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. ఈ సంక్షోభాన్ని భారత్ దౌత్యపరంగా ఎలా ఎదుర్కొంటుందో, అమెరికా ఏకపక్ష నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు ఏ విధంగా అడ్డుకుంటాయో వేచి చూడాలి.
Also Read: పీఓకేలో ఉద్రిక్తం.. శాంతియుత ప్రదర్శనలపై పాక్ సైన్యం కాల్పులు, ఇంటర్నెట్ బంద్!