Vaishnavi- Jahnavi: వైష్ణవి.. జాహ్నావి ఈ ఇద్దరు బాధితుల తల్లుల కన్నీళ్లు చట్టాన్ని ప్రశ్నిస్తున్నాయి. నా బిడ్డను చంపిందెవరని ఓ తల్లి.. మా పసిపాప ఎక్కడ ఉందని మరో తల్లి ఆవేదన. గండికోట వైష్ణవి హత్య జరిగి నేటికి ఏడాది పూర్తయింది. అయినా ఇప్పటికీ ఆ కేసు గండికోట రహస్యమే. కాకినాడ జిల్లాలో రెండేళ్ల పసిపాప జాహ్నవి అదృశ్యమై నెల దాటుతున్నా ఆచూకీ లేదు. కావాల్సినంతా టెక్నాలజీ ఉంది. డాగ్ స్క్వాడ్లు ఉన్నాయి.. కానీ, ఆ తల్లుల కన్నీళ్లు ఆపలేకపోయాం. మన పోలీసు వ్యవస్థకు ఏమైంది.? మిస్టరీలను చేధించడంలో ఎక్కడ వెనుకబడిపోతున్నారు?
సమాధానం చెప్పలేని పోలీసులు..
ఏడాది కిందట సరిగ్గా ఇదే రోజు గండికోట కోట గోడల మధ్య ఒక ఇంటర్ అమ్మాయి విగతజీవిగా పడి ఉంది. శరీరమంతా బలమైన గాయాలు. ఎంతో నరకం అనుభవించి చివరికి ప్రాణాలు విడిచింది. ఆ రోజు పోలీసులు రెండు రోజుల్లో హంతకులను పట్టుకుంటామని ఛాలెంజ్ చేశారు. ఏడాదైనా ఆ కేసు ఇప్పటికీ గండికోట రహస్యమే..? క్లూస్ టీమ్స్ వచ్చాయి, టవర్ లొకేషన్లు చూశారు, నార్కో అనాలిసిస్ టెస్టులు కూడా చేశారు. కొండను తవ్వినంత పని చేసి.. చివరకు ఎలుకను కూడా పట్టుకోలేకపోయారు. ‘నా బిడ్డను చంపినోడు సమాజంలో తిరుగుతుంటే.. మీ టెక్నాలజీ ఎందుకు సార్?’ అని బాధితురాలి కన్నతల్లి అడిగిన ప్రశ్నకు పోలీసుల దగ్గర సమాధానం లేదు.
Also Read: పీఓకేలో ఉద్రిక్తం.. శాంతియుత ప్రదర్శనలపై పాక్ సైన్యం కాల్పులు, ఇంటర్నెట్ బంద్!
పాపను తెచ్చి ఇచ్చేయండి.. మీ మీద కేసు పెట్టం..
కాకినాడ జిల్లా తుని మండలంలో జరిగిన మరో ఘోరం గుండెల్ని పిండేస్తోంది. రెండేళ్ల పసిపాప జాహ్నవి ఆడుకుంటూ కనిపించకుండా పోయి నెల రోజులు దాటిపోతోంది. వందల మంది పోలీసులు, డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్లు అడవులన్నీ గాలించాయి. చివరికి డీఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి పాపను తెచ్చి ఇచ్చేయండి.. మీ మీద ఎలాంటి కేసు పెట్టమని బతిమిలాడే పరిస్థితి వచ్చింది. ఈ కేసు కూడా రేపు ఆయేషా, గండికోట కేసుల లాగే ఒక మిస్టరీ ఫైల్గా మిగిలిపోతుందా? టెక్నాలజీ పెరిగేకొద్దీ నేరగాళ్లు స్మార్ట్ అవుతున్నారా.. లేక పోలీసులు గ్రౌండ్ లెవెల్ రియాలిటీలను గాలికొదిలేస్తున్నారా?
పాతకాలపు చాకచక్యాన్ని బయటకు తీయాలి..
కాల్ డేటాలు, సీసీటీవీ ఫుటేజీలు లేని బ్లైండ్ స్పాట్స్లో నేరాలు జరిగితే.. పోలీసులు ఎందుకు చేతులు ఎత్తేస్తున్నారు. పాతకాలపు ఇన్ఫార్మర్ల వ్యవస్థను వాడటంలో పోలీసులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు. కేవలం ఫోన్ లొకేషన్ల మీద ఆధారపడి కూర్చుంటే.. నేరగాళ్లు తప్పించుకుంటూనే ఉంటారు. ఆయేషా మీరా, గండికోట వైష్ణవి ఆత్మలు శాంతించాలన్నా, బుజ్జితల్లి జాహ్నవి తల్లి ఒడికి చేరాలన్నా.. పోలీసులు టెక్నాలజీతో పాటు తమలోని మానవత్వాన్ని, పాతకాలపు చాకచక్యాన్ని బయటకు తీయాలి. అప్పుడే ఈ తల్లుల కన్నీళ్లకు న్యాయం జరుగుతుంది.
Also Read: రైల్వే ఏసీ కోచ్ల్లో భారీ దొంగతనాలు.. రూ.104 కోట్ల నష్టం!